బీహార్ ఎన్నికల్లో సోషల్ మీడియా రచ్చ- బీజేపీకి లబ్ది కలగకుండా చూడాలని ఈసీకి ఫిర్యాదులు..
బీహార్ ఎన్నికల్లో అధికార బీజేపీ-జేడీయూ కూటమి ధన ప్రవాహానికి తెరలేపుతోందని, సోషల్ మీడియాను తమకు అనుకూలంగా వాడుకుంటూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మహాకూటమి ఆరోపించింది. ఈవీఎంల్లో అక్రమాలకు కూడా పాల్పడే అవకాశముందని మహాకూటమి ఆందోళన వ్యక్తం చేసింది.
బీహార్ ఎన్నికల్లో ధనప్రవాహం, సోషల్ మీడియా వాడకం, ఈవీఎంల అక్రమాలపై ఈసీ కఠినంగా వ్యవహరించాలని మహాకూటమి భాగస్వామి సీపీఎం ఈసీని కోరింది. ఈ మేరకు తాజాగా ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసింది. గతంలో ఇదే అంశంపై ఫిర్యాదు చేసినా ఈసీ నుంచి సమాధానం రాలేదని లేఖలో సీపీఎం తెలిపింది. ఢిల్లీ ఎన్నికల సమయంలో ఫేస్బుక్లో ఫేక్ ఖాతాలను సృష్టించడం ద్వారా బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో బీహార్ ఎన్నికల్లోనూ సోషల్ మీడియా సాయంతో బీజేపీ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని మహాకూటమి ఆరోపిస్తోంది.
Recommended Video
బీహార్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ ఇప్పటికే 72 వేల వాట్సాప్ గ్రూపులను ప్రారంభించినట్లు అధికారికంగానే చెబుతోంది. వీటిలో 50 వేల ఖాతాలు రెండు నెలల క్రితమే ప్రారంభించింది. వీటిని నిర్వహించేందుకు 9500 మంది సిబ్బందిని కూడా నియమించుకుంది. పోలింగ్ బూత్కు ఒకరు చొప్పున వీరు పనిచేస్తున్నారు. ఇందుకోసం బీజేపీ భారీగా ఖర్చుచేస్తోందని, ఎన్నికల్లో సోషల్ మీడియా వాడకం ద్వారా అనుచితంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది.