బెంగాల్ బీజేపీలోకి వలసలు... సీపీఎంకి షాకిచ్చిన ఎమ్మెల్యే.. అమిత్ షా సమక్షంలో రేపు చేరిక?
పశ్చిమ బెంగాల్లో రాజకీయం క్షణ క్షణానికి మారుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే మమతా కేబినెట్ నుంచి తప్పుకున్న మంత్రి సువెందు గురువారం(డిసెంబర్ 17) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రేపో మాపో ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే మరో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఓ సీపీఎం ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
హల్దియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాప్సీ మండల్ అనే మహిళా ఎమ్మెల్యే శనివారం(డిసెంబర్ 19) బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనే ర్యాలీలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు చెప్పారు. 'సీపీఎంలో నేను మానసిక వేదనకు గురయ్యాను. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో పార్టీతోనే ఉన్నాను. అయినప్పటికీ పేద ప్రజలను పార్టీ చేరుకోలేకపోతోంది. పార్టీ కింది స్థాయి కేడర్ క్షీణించింది. కాబట్టి ఇంకా ఇదే పార్టీలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేయడం కష్టం. అందుకే బీజేపీలో చేరబోతున్నాను.' అని మండల్ వెల్లడించారు.మండల్ సీపీఎంని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఆ పార్టీ ఆమెను బహిష్కరించింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా శుక్రవారం(డిసెంబర్ 18) రాత్రి కోల్కతా చేరుకోనున్నారు. అమిత్ షా పర్యటనలోనే సువెందు అధికారి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అక్కడ కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలంతా వరుసబెట్టి బెంగాల్లో పర్యటిస్తున్నారు. టీఎంసీ నేతలను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నారు. బీజేపీ బెంగాల్లో బలపడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ దూకుడును ఎలా ఎదుర్కోవాలో తెలియక మమతా బెనర్జీ సతమతమవుతున్నారు.