నిన్న ఆజాద్..నేడు ఏచూరి, డీ రాజా: కాశ్మీర్ లో ప్రతిపక్షాన్ని అడుగు పెట్టనివ్వని కేంద్రం!
శ్రీనగర్: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, డీ రాజా అరెస్ట్ అయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. అక్కడే నిర్బంధించాయి. ఆనారోగ్యానికి గురైన జమ్మూ కాశ్మీర్ సీపీఎం ఎమ్మెల్యే ఎం వై తరిగామిని పరామర్శించడానికి సీతారాం ఏచూరి, డీ రాజా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి విమానంలో జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వెంటనే భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి.
భద్రతా బలగాలు సీతాారాం ఏచూరిని ఎటూ కదలనివ్వట్లేదని, అడుగు కూడా బయట పెట్టనివ్వట్లేదని సీపీఎం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ సమాచారాన్ని పొందుపరిచింది. జమ్మూ కాశ్మీర్ కు వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ను కూడా భద్రతా బలగాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా- సీతారాం ఏచూరిని నిర్బంధంలోకి తీసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ఎమ్మెల్యే ఎం వై తరిగామి సహా పలువురు ప్రతిపక్ష నేతలు గృహ నిర్బంధంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రతిపక్షాలు అడుగు పెడితే.. స్థానిక యువతను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఫలితంగా- ఏమైనా జరగొచ్చని కేంద్రం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో- ప్రతిపక్ష నేతలు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. ఇలా ఎన్నిరోజులు ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారని అంటూ కాంగ్రెస్, సీపీఎం నేతలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఏచూరి విమర్శించారు. తాను శ్రీనగర్ విమానాశ్రయంలో అడుగు పెట్టిన వెంటనే భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని, జమ్మూ కాశ్మీర్ లోకి ఎవరూ రాకుండా నిషేధం విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తనకు చూపించారని తెలిపారు.