అవమానించారా..! : అచ్యుతానందన్ ను పక్కన పెట్టేసినట్టేనా..!
తిరువనంతపురం : కేరళలో విజయం సాధించిన ఎల్డీఎఫ్ పార్టీ, సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతూనే ఉంది. దీనిపై నెలకొన్న మీమాంసను ఈరోజు జరిగే పార్టీ సమావేశం ద్వారా ఓ కొలిక్కి తీసుకురావాలనే యోచనలో ఉన్నాయి పార్టీ వర్గాలు.
సీఎం రేసుకు తాను కూడా ఫిట్ అంటూ పార్టీ కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ప్రకటించడంతో సీఎం ఎవరనే దానిపై సందిగ్ఘం ఏర్పడింది. అంతకుముందు పిన్రాయి విజయన్ నే సీఎంగా ప్రకటించాలని భావించిన పార్టీ అచ్యుతానందన్ ప్రకటనతో పునరాలోచనలో పడింది. దీంతో సీఎంగా ఐదేళ్ల పదవీ కాలానికి అచ్యుతానందన్, విజయన్ కు చెరో రెండు, మూడేళ్ల అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా జరిగిన సమావేశంలో సీఎంగా విజయన్ కే అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి ఎల్డీఎఫ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచనలో భాగంగా.. తిరువనంతపురంలో సీపీఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం సమావేశమైంది. సమావేశానికి అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ సహా తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. సీఎంగా విజయన్ పేరే అందరు ప్రతిపాదించడంతో సీనియర్ నేత అచ్యుతానందన్ అసంత్రుప్తితో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్టుగా సమాచారం. సమావేశం ఇంకా కొనసాగుతున్నందువల్ల సాయంత్రం వరకు పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.