సరస్వతి చెప్పింది నిజమైతే! అమ్మ ఆరోగ్యంపై ఆమె ఏం చెప్పిందంటే!
అన్నాడీఎంకె మహిళా నేత సీఆర్ సరస్వతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఊరటనిచ్చేవిగా ఉన్నా.. మరికొంత సమయం గడిస్తే గానీ అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
చెన్నై: చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ ఆరోగ్యంపై అంతకంతకూ హైటెన్షన్ పెరుగుతూనే ఉంది. సీఎం జయలలిత గుండెపోటుకు గురయ్యారన్న వార్త విన్న మరుక్షణం తమిళనాడులో ఒక్కసారిగా పరిస్థితి భావోద్వేగపూరితంగా మారిపోయింది. పెద్ద ఎత్తున జనాలు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
ప్రస్తుతం తమిళనాడు తాత్కాళిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ మహిళా నేత సీఆర్ సరస్వతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఊరటనిచ్చేవిగా ఉన్నా.. మరికొంత సమయం గడిస్తే గానీ అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఇంతకీ సరస్వతి ఏం చెప్పారంటే.. ఆదివారం సాయంత్రం జయలలిత ఆరోగ్యం విషమించిన మాట వాస్తవమేనని, అయితే నేటి ఉదయం యాంజియోగ్రామ్ విధానంలో ఆమెకు డాక్టర్లు చికిత్స అందించారని ఆమె తెలిపారు. భయపడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏమి లేదని, అమ్మ కోలుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. సరస్వతి మాటలు భరోసానిచ్చేవిగా ఉన్నా.. అమ్మ ఆరోగ్యంపై తమిళ ప్రజల్లో నెలకొన్న టెన్షన్ కు మాత్రం తెరపడట్లేదు. డాక్టర్లు అధికారిక బులెటిన్ విడుదల చేసినప్పటికీ.. పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్లు ప్రకటించడంతో.. అమ్మ ఆరోగ్యంపై ఆందోళన మరింత ఎక్కువైందనే చెప్పాలి.