బేడీపై భూషణ్ ప్రశంసలు: ఢిల్లీకి ఆమెలాంటి నిజాయితీ సీఎం కావాలి
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్బేదీపై ప్రముఖ న్యాయవాది, అమ్ ఆద్మీ ఫౌండర్ మెంబర్ ప్రశాంత్ భూషణ్ ప్రశంసల జల్లు కురిపించి రాజకీయాల్లో మరింత వేడి పెంచారు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ బేడీ ఢిల్లీకి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందిస్తారని, ఆమె ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్లలో తానొకడని అన్నారు. కిరణ్ బేడీనిముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తేవడాన్ని బీజేపీది తెలివైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.
అన్నాహాజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కిరణ్ బేడీ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. గత ఏడాది అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు ముఖ్యమంత్రి పదవిని అందించేందుకు సిద్ధపడ్డాడు. ఐనా సరే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదని అన్నారు.
పోలీస్ అధికారిణిగా కూడా ఆమె సమర్థవంతంగా పనిచేశారని ఆయన అన్నారు. ఆమె ముఖ్యమంత్రి అయితే ఢిల్లీ ప్రజలకు మంచి ప్రభుత్వం అందిస్తారని అభిప్రాయపడుతున్నట్లు భూషణ్ చెప్పారు. మొదటి నుంచి కూడా ఆమె మైండ్ బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.
ఆమె గనుక ఏఏపీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేందుకు నా ప్రాధాన్యం ఉండేదన్నారు. కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్కు మంచి ప్రత్యర్ధి అంటూ కితాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వారికే కేజ్రీవాల్ టిక్కెట్లు ఇచ్చారన్నారు. బీజేపీ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సక్సెస్ అనడానికి కిరణ్ బేడీ నామినేషన్ ఉదాహరణ అని అన్నారు.
ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న కిరణ్ బేడీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ పాదయాత్రలు చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకే పాదయాత్ర ప్రారంభించి... ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆమెతో పాటు కేంద్ర మంత్రి హర్షవర్థన్ ఢిల్లీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తన నియోజకవర్గం కృష్ణానగర్లో ఆమె పర్యటిస్తున్నారు. బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదని కిరణ్ బేడీ అన్నారు.