నిలువునా చీలిపోయిన మన్నార్ గుడి ఫ్యామిలీ, దినకరన్ కు పోటీగా కొత్త పార్టీ, జైల్లో శశికళ !
చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ మన్నార్ గుడి ఫ్యామిలీ నిలువునా చీలిపోయింది. శశికళ సొంత సోదరుడు దివాకరన్, అమ్మా మక్కల్ మున్నేట్ర కగజం పార్టీ వ్యవస్థాపకుడు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మధ్య వార్ మొదలైయ్యింది. బహిరంగంగానే నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనుకునే వరకు విమర్శలు చేసుకుంటున్నారు. శశికళ ఫ్యామిలీ రచ్చ ఇప్పుడు తమిళనాడులో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది.
అన్నా, ద్రవిడుల సిద్దాంతాలు
టీటీవీ దినకరన్ ప్రారంభించిన అమ్మా మక్కల్ మున్నేట్ర కగజం పార్టీలో అన్నా ఆశయాలు, ద్రవిడుల సిద్దాంతాలు ఏమాత్రం లేవని, ఆ పార్టీ నుంచి తాము పోటీ చెయ్యమని, తమ మద్దతుదారులు వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తారని శశికళ సొంత సోదరుడు దివాకరన్ తేల్చిచెప్పారు.
మేము అంగీకరించం
అమ్మా మక్కల్ మున్నేట్ర కగజం పార్టీ సిద్దాంతాలు, వాటి కార్యకలాపాలను తాము ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించలేమని, మా మద్దతుదారులు టీటీవీ దినకరన్ పార్టీలో చేరడానికి సిద్దంగాలేరని దివాకరన్ కుండలుబద్దలుకొట్టి మరీ చెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకం
తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని శశికళతో పాటు మా కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకిస్తున్నామని ఇటీవల సేలంలో ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ చెప్పిన విషయం తెలిసిందే.
ఆధిపత్యపోరు
శశికళ ఫ్యామిలీలో చాలకాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. టీటీవీ దినకరన్ వర్గం ముందు నుంచి దివాకరన్ వర్గంను చూస్తే మండిపడుతోంది. టీటీవీ దినకరన్ వర్గం మీద దివాకరన్ వర్గం వీలుచిక్కినప్పుడు విమర్శలు చేస్తూనే ఉంది.
విసిగిపోయిన శశికళ
కుటుంబ సభ్యులు అందర్నీ ఒక్కటి చెయ్యడానికి శశికళ చాలకాలంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. భర్త నటరాజన్ చనిపోయిన సమయంలో పెరెల్ మీద బయటకు వచ్చిన శశికళ తంజావూరులో మన్నార్ గుడి ఫ్యామిలీని ఒక్కటి చెయ్యడానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ఒక్కటికాకపోవడంతో పెరోల్ సమయంలో ఇంకా ఉండగానే అంతకు ముందే శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లిపోయారు.