దేశ వ్యాప్తంగా ఆ పేరుకు క్రేజ్ .. మగపిల్లలకు అభినందన్ , ఆడపిల్లలకు అభినందన అని నామకరణం
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్... ఈ పేరు చెప్తేనే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నరనరాల్లో దేశభక్తి పెల్లుబుకుతోంది. భారతీయుల హృదయాలు ధీరత్వంతో నిండిపోతున్నాయి . అభినందన్ అనే పేరు భారత్ కు ఓ బ్రాండ్గా మారిపోయింది. పాకిస్థాన్ చెరలో ఉన్నా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రియల్ హీరో అనిపించుకున్నారు. దీంతో దేశ ప్రజలు ఇప్పుడు ఆయనకు ఎనలేని గౌరవాభిమానాలతో నీరాజనాలు పడుతున్నారు. అతనిపై ఉన్న గౌరవానికి సూచనగా తమకు పుట్టిన చిన్నారులకు అభినందన్ పేరు పెట్టుకుంటున్నారు. తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.
అభినందన్ మీద అభిమానంతో కర్ణాటకలోని బాగల్కోట్కు చెందిన దంపతులు అరవింద్, పూర్ణిమ ఇటీవలే పుట్టిన తమ చిన్నారికి 'అభినందన' అని పేరు పెట్టుకున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు గౌరవ సూచకంగా తమ పాపకు ఈ పేరు పెట్టుకున్నట్లు వారు తెలిపారు. అరవింద్..స్థానిక మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 11న తమకు ఆడబిడ్డ జన్మించిందని..అభినందన్ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని..అందుకే ఆయనపై తమకున్న గౌరవంతో..బారసాల రోజులన తమ బిడ్డకు ''అభినందన'' అనే పేరు పెట్టుకున్నామని అరవింద్ తెలిపారు. ఇలా దేశ వ్యాప్తంగా పుట్టిన మగపిల్లలకు అభినందన్ అని..ఆడపిల్లకు అభినందన అని..ఇంకొందరు సర్జికల్ దాడులలో వినియోగించిన మిరాజ్ విమానాల పేర్లను కూడా పెట్టుకుంటు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
శత్రువు చేతికి చిక్కినా.. వెల్కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులు
ఇటీవల చెన్నైలో ఒక శిశువుకి అభినందన్ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్లోనూ ఇద్దరు శిశువులకు వారి తల్లిదండ్రులు ఇదే పేరు పెట్టారు. దౌసాలోని నిహల్పుర్లో విమలేశ్ బెందారా (26) అనే మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అభినందన్ ధైర్యసాహసాల గురించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆ పిల్లాడికి ఈ పేరు పెట్టేశారు. రాజస్థాన్లోని సంగనెర్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నీలం తిక్కివల్, రవి తిక్కివల్ దంపతులకి శుక్రవారం బాబు జన్మించగా, ఆ శిశువుకి అభినందన్ పేరు పెట్టారు. ఈ క్రమంలోనే అభినందన్ పాకిస్థాన్ చెరను వీడి సరిగ్గా భారత్లో అడుగుపెట్టిన క్షణంలో పుట్టిన తమ కుమారుడికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు మహారాష్ట్రలోని భీవాండి దంపతులు ఆకాశ్, మోనిక తెలిపారు.