ధారావి గోస ఎంత దుర్భరమంటే... కరోనాపై పోరుకు అక్కడ అదొక్కటే పరిష్కారం..
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే 5218 కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధానిలో నమోదవుతున్న ఈ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 20 రోజుల వ్యవధిలోనే 180 పాజిటివ్ కేసులు నమోదవడం మరింత కలవరపెడుతోంది.
Recommended Video
కిక్కిరిసిన ఇళ్లు,ఇద్దరికి మాత్రమే సౌలభ్యంగా ఉండే ఇంట్లో దాదాపు 10 మంది నివాసం ఉండటం,స్పేస్ అన్న పదానికి తావే లేని ఆ ప్రాంతంలో.. కరోనాను కట్టడి చేయడం పెను సవాల్గా మారింది. 23 ఏళ్లుగా భారత్లోని మురికివాడల పరిస్థితులను అధ్యయనం చేస్తూ.. ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చిన ముకేష్ మెహ్తా అనే ఓ ఆర్కిటెక్ట్ ఈ సమస్య పరిష్కారానికి కీలక సూచనలిచ్చారు.
ఇదీ ధారావి దుర్భర స్థితి...
ధారావిలో సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎంత కష్టమో తెలుసుకోవాలంటే.. ముందు అక్కడి లేఅవుట్ గురించి తెలుసుకోవాలని ముకేష్ మెహ్తా చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనసాంద్రత కలిగిన మురికివాడ ధారావి అని చెప్పారు. ఒక హెక్టార్(2.47ఎకరాలు) ప్రాంతంలో దాదాపు 650 కుటుంబాలు,3300 మంది జనాభా నివసిస్తున్నట్టు తెలిపారు. దాదాపు 20 నుంచి 30 కుటుంబాలకు కలిపి కేవలం ఒకే కమ్యూనిటీ టాయిలెట్ ఉందని.. ఒకే మంచినీటి నల్లా ఉందని చెప్పారు. అక్కడి నివాసాల్లో సగటున ఒక్కో గుడిసె దాదాపు 100 నుంచి 200 చదరపు మీటర్లు ఉంటుందని.. ఒక్కో దానిలో కనీసం ఐదు నుంచి ఎనిమిదిమంది నివసిస్తున్నారని చెప్పారు.
సోషల్ డిస్టెన్స్ అసాధ్యం..
ఇప్పటికీ ధారావిలో చాలా ఇళ్లకు మెయిన్ డోర్ తప్ప కిటికీలు లేవన్నారు. ఆ ఇళ్లకు వెంటిలేషన్ వచ్చే ఒకే ఒక్క మార్గం మెయిన్ డోర్ను ఓపెన్ చేయడమేనని చెప్పారు. ఎదురెదురు ఇళ్ల మధ్య దూరం కేవలం 3-4 అడుగులు మాత్రమే ఉంటుందన్నారు. ఇంత దుర్భర పరిస్థితుల్లో అక్కడి ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. అత్యంత ఇరుకుగా ఉండే అక్కడి వీధుల్లో.. ఓవైపు బకెట్లలో నీళ్లు మోసే జనం,మరోవైపు ఆహార పదార్థాలు తీసుకెళ్లేవారు.. ఇలా అటు ఇటూ నడిచేవాళ్లు సోషల్ డిస్టెన్స్ పాటించడం అసాధ్యమన్నారు.
మరి దీనికి పరిష్కారమేంటి..
ధారావిలో సోషల్ డిస్టెన్స్ను అమలుచేయాలంటే ఒకే ఒక్క మార్గం ఉందన్నారు ముకేష్ మెహ్తా. ఎక్కడికక్కడ స్థానిక నాయకులను తయారుచేసి వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ధారావి మొత్తాన్ని క్లస్టర్లుగా విభజించి.. అక్కడి ప్రజలను చిన్న,చిన్న గ్రూపులుగా చేసి.. అందులో నుంచే ఒక నాయకుడిని ఎంపిక చేసి.. ఆ గ్రూపు బాధ్యతలు అతనికి అప్పగించాలని సూచించారు. అంతకంటే ముందు వారికి అవసరమైన శిక్షణ ఇప్పించాలని.. ఆ తర్వాత వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు.
లోకల్ లీడర్స్ ఆర్మీ.. అదొక్కటే మార్గం..
ఒడిశా,రాజస్తాన్,మధ్యప్రదేశ్ సహా తదితర ఎన్నో రాష్ట్రాల్లోని మురికివాడలపై ఏళ్లుగా తాను అధ్యయనం చేస్తున్నానని మెహ్తా వెల్లడించారు. ప్రతీ మురికివాడకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని.. అలాగే అక్కడి పరిస్థితులను బట్టి వేర్వేరు సవాళ్లు ఉంటాయని చెప్పారు. అయితే తాను చేసిన ప్రతిపాదన ప్రతీ మురికివాడలోనూ వర్కౌట్ అవుతుందన్నారు.
ముఖ్యమంత్రి లేదా అధికారులు మాత్రమే ప్రతీ ఒక్కరి సమస్యలను తీర్చలేరు కాబట్టి.. తాను చేసిన ప్రతిపాదనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ఈ విధానాన్ని అమలుచేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. స్థానికంగా ఉండే నాయకులంతా తమకు అప్పగించిన గ్రూపుల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయడంతో పాటు.. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలు,సూచనలను వారు తూచా తప్పకుండా పాటిస్తారన్నారు. తమ గ్రూపులోని ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. తద్వారా వైరస్ను కట్టడి చేయవచ్చునని.. ఇందుకు కావాల్సిందల్లా లోకల్ లీడర్స్ ఆర్మీ అని పునరుద్ఘాటించారు.