క్రెడిట్ సుప్రీందే: జెఠ్మలానీ, రహస్య ఎజెండా: ఏచూరి
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత అంశంపై ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ స్పందించారు. భారత రాజకీయ చరిత్రలో ఇదో శుభపరిణామమని ఆయన అన్నారు. అయితే ఈ క్రెడిట్ ఆర్థిక శాఖకు గానీ అటార్నీ జనరల్కు దానీ దక్కదని, సుప్రీంకోర్టుకే దక్కుతుందని ఆయన అన్నారు.
నల్లకుబేరుల జాబితాలోని పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాలని ఆయన సూచించారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం లేదా అధికారవర్గం చేతుల్లో పెట్టుకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నల్లకుబేరుల జాబితాను బుధవారం ఉదయం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన విషయం తెలిసిందే.
విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని భారత్కు తెప్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. కేవలం నల్ల కుబేరుల పేర్లను వెల్లడించడమే కాకుండా నల్లధనాన్ని భారత్కు తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో బిజెపికి అండగా నిలిచిన కార్పోరేట్ సంస్థలను రక్షించాలనే రహస్య ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, అయితే మళ్లీ ఆ అంశాన్ని కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకుని వెళ్లిందో తెలియడం లేదని ఆయన అన్నారు.