మోడీకి షాక్: ఆరెస్సెస్ చీఫ్ సంచలనం, హిందుత్వ పైన..
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత ప్రజలదేనని, కొంతమంది వ్యక్తులకో, పార్టీకో దక్కదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క వ్యక్తి కారణంగానో బీజేపీకి విజయం సిద్ధించలేదని, జనం మార్పు కోరుకున్న కారణంగానే గెలిచిందన్నారు.
మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఝలక్ ఇచ్చినట్లయింది. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం మారాలని ప్రజలు బలంగా కోరుకున్నారన్నారు. విజయానికి కారణమని చెప్పుకుంటున్న వారు గతంలోను ఉన్నారని, అనవసర విషయాలు వదిలి పాలన సమర్థవంతంగా చేయాలని సూచించారు.
అయితే, బీజేపీ పాలన సరైన మార్గంలోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలన బాగా లేకుంటే ప్రజలు 2019లో తిప్పికొడతారన్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అభివర్ణించిన అనంతరం మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల విజయంలో అమిత్ షా పాత్రను ప్రస్తావిస్తూ మోడీ ఆయనను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నారు.
హిందుత్వ అంటే...
ఇంగ్లండ్ దేశస్తులను ఇంగ్లిష్ వాళ్ళని, జర్మనీ ప్రజలను జర్మన్లని, యూఎస్ఏలో ఉండేవారిని అమెరికన్లని అంటామని, అలాంటప్పుడు భారత్లో నివసిస్తున్న వారిని హిందుస్తాన్ వారిగా ఎందుకు పరిగణించడం లేదని మోహన్ భగవత్ వేరుగాప్రశ్నించారు. భారతీయులందరి సాంస్కృతిక గుర్తింపు హిందుత్వ అన్నారు. ఇక్కడ నివసిస్తున్న వారందరూ ఆ మహోన్నత సంస్కృతికి వారసులే అన్నారు.
హిందుత్వ అనేది ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమన్నారు. ప్రాచీన కాలం నుంచి భారత్ భిన్న వైరుధ్యాల నేపథ్యంలోనూ సంఘటితంగా ఉండడానికి కారణం హిందుత్వ అని ఇప్పుడు మిగతా ప్రపంచం తెలుసుకున్నదన్నారు. అయితే, దురదృష్టకర రీతిలో భారత్లో కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని, హిందుత్వ గురించి చెబితే మతవాద ముద్ర వేస్తున్నారన్నారు. దేశంలో ధర్మం ఉంటే ప్రపంచం మనల్ని గౌరవిస్తుందన్నారు. కాగా, భగవత్ వ్యాఖ్యలను శివసేన స్వాగతించింది.