ఐపీఎల్ హైటెక్ క్రికెట్ బెట్టింగ్: ఐదుగురి అరెస్టు
బెంగళూరు: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదు మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇట్టుమడు 19వ క్రాస్ లోని ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సీసీబీ పోలీసులకు సమాచారం అందింది.
ఇంటి మీద దాడి చేసి మంజునాథ్, నవీన్, జే.కే. రావ్, మల్లేష్, అశోక్ అనే నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అన్నారు. నిందితుల నుండి రూ. 7 లక్షలు, 19 మొబైల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.
మైసూరు నగరంలోని రంగ అనే బుక్కితో కలిసి వీరు ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రపంచ కప్ మొదలైనప్పటి నుండి బెంగళూరు నగరంలో బెట్టింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఎం.ఎన్. రెడ్డి చెప్పారు.
ఇప్పటి వరకు 16 బెట్టింగ్ కేంద్రాలపై దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న 35 మందిని అరెస్టు చేసి రూ. 55 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అరెస్టు అయిన బుక్కీలు వారంలోపు కోర్టులో దర్జాగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చి మళ్లి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇంతకు ముందు అత్యాచారం చేసిన వారి మీద, లైంగిక వేధింపులు పాల్పడిన వారు, సంఘవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన వారి మీద మాత్రమే గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని అన్నారు. అయితే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారి మీద గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎం.ఎన్. రెడ్డి హెచ్చరించారు.