ఐదుగురు సజీవ దహనం: యమునా ఎక్స్ప్రెస్ వేపై కారును ఢీ కొన్న ట్రక్కు.. సీనియర్ జర్నలిస్ట్..
యమునా ఎక్స్ప్రెస్ వే పై మరో ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కంటైయినర్ ట్రక్ కారును ఢీ కొంది. ఆగ్రాలో గల ఖాందొలి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్న ఐదుగురు చనిపోయారు. వారిలో లక్నోకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఉన్నారు.
ఉదయం 4.15 గంటలకు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కంటైనర్ ట్రక్ యూ టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో జర్నలిస్ట్ మురళి మనోహర్ సరోజ్, అతని భార్య, అత్త, మరదలు, స్నేహితుడు సందీప్ ఉన్నారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే డీజిల్ ట్యాంక్ ఓపెన్ అయి.. కారు బ్యానెట్పై చిమ్మింది. అప్పటికే వేడిగా ఉన్న ఇంజిన్ మీద డీజిల్ పడటంతో.. మంటలు ఎగిసిపడ్డాయి.
వాస్తవానికి సరోజ్ అనారోగ్యంగా ఉన్నారు. చికిత్స కోసం ఢిల్లీకి వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కంటెయినర్ ట్రక్కులో అమెజాన్కు చెందిన వస్తువులు ఉన్నాయని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. జైపూర్ నుంచి పశ్చిమ బెంగాల్కు వస్తువులను తరలిస్తున్నారని.. ప్రమాదం జరిగిన వెంటనే కంటెయినర్ ట్రక్ డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న ఐదుగురు సురక్షితంగా ఉన్నారు. తమను కాపాడాలని వారు కోరుకున్నారు. కానీ వారిని రక్షించేందుకు సమీపంలో ఎవరూ లేరు. వారు వచ్చే లోపు మంటలు ఎగిసిపడ్డాయి. కారు ఢీ కొన్న తర్వాత సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఫ్రీజ్ అయ్యింది. కారు డోర్లు మూసుకుపోయాయి. డోర్ గ్లాస్ పగలగొట్టడానికి వారికి తోచలేదు. మంటలు ఎగసిపడ్డ.. వారు అందులోనే ఉండిపోయారు. ట్రక్ డ్రైవర్ నావిగేషన్లో ఎర్రర్ వచ్చిందని.. అందుకోసమే యూ టర్న్ తీసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నివేదించారు. ఈ క్రమంలో కారు ప్రమాదం జరిగిందని తెలిపారు.