కొత్త ఇన్నింగ్స్: యూపీ రాజకీయాల్లోకి పేసర్ ప్రవీణ్ కుమార్
లక్నో: భారత పేస్ బౌలర్ ప్రవీణ్కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.
యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవీణ్కుమార్కు కండువా కప్పి ఎస్పీలోకి ఆహ్వానించారు. మీరట్కు చెందిన ప్రవీణ్కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు.
ఆరు టెస్టులు ఆడిన ప్రవీణ్ 27 వికెట్లు పడగొట్టాడు. 68 వన్డే మ్యాచ్లు ఆడి 77వికెట్లు తీసుకున్నాడు. పది టీ-20 మ్యాచ్ల్లో ఎనిమిది వికెట్లు సాధించాడు. చివరగా 2012 ఆగస్టులో టీమిండియా సభ్యుడిగా దక్షిణాఫ్రికాతో టీ-20 మ్యాచ్ ఆడాడు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సార్వత్రిక ఎన్నికల ముందు బిసిసిఐ జీవితకాల నిషేధం విధించిన శ్రీశాంత్ కేరళ రాజకీయాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.