క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి మాస్కు ధరించలేదు: పోలీసులతో వాగ్వాదం
గాంధీనగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడ్డారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో సోమవారం రాత్రి సతీమణి రివాబాతో కలిసి రవీంద్ర జడేజా కారులో ప్రయాణిస్తున్నారు. అయితే, జడేజా మాస్కు ధరించగా.. రివాబా మాత్రం మాస్కు ధరించలేదు. దీన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ సోనాల్ గొసాయి కిసాన్పరా చౌక్ వద్ద కారును ఆపారు.
మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా.. రివాబా వాగ్వాదానికి దిగారని డిప్యూటీ పోలీసు కమిషనర్ మనోహర్ సిన్హా జడేజా తెలిపారు. అయితే, ఇరువురు పరస్పరం దూషించుకున్నట్లు తెలిసిందని వెల్లడించారు.
మా ప్రాథమిక సమాచారం ప్రకారం రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా మాస్కు ధరించలేదు. అయితే, ఈ వాగ్వాదం జరిగిన ఘటనపై విచారిస్తున్నామని తెలిపారు. కాగా, వాగ్వాదం తర్వాత కొంత అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చేరారు. అరగంటలోనే చికిత్స తీసుకుని కోలుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పారు.
ఇది ఇలావుంటే, ఐపీఎల్-2020కి రవీంద్ర జడేజా సిద్ధమవుతున్నాడు. త్వరలోనే చెపాక్లోని చెన్నై సూపర్ కింగ్స్ శిబిరానికి చేరుకుంటాడు. అనంతరం 24 గంటల వ్యవధిలో రెండుసార్లుఆర్టీపీసీఆర్ పరీక్షలో చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా నెగిటివ్ వస్తేనే ఆగస్టు 22న దుబాయ్కి వెళ్తాడు. ఆటగాళ్లందరికీ ఈ పరీక్షలు చేయనున్నారు.