హార్దిక్పటేల్ పై పోటీకి క్రికెటర్ జడేజా భార్య సై.. జామ్నగర్ బీజేపీ టికెట్ పై కన్ను
జామ్నగర్ : లోక్సభ ఎన్నికల వేళ కొన్ని సెగ్మెంట్లు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అదే క్రమంలో గుజరాత్ లోని జామ్నగర్ నియోజకవర్గం చర్చానీయాంశంగా మారింది. పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడినుంచి అతడిని బరిలోకి దించాలనేది ఆ పార్టీ హైకమాండ్ ఆలోచన. అయితే హార్దిక్ పటేల్ కు చెక్ పెట్టడానికి బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?
గుజరాత్ కర్ని సేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు రివాబా. అయితే క్షత్రియ వర్గీయుల అండతో మార్చి తొలివారంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్రమంలో జామ్నగర్ సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనమ్ మాదమ్ కూడా మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ పై చాలామంది దృష్టి సారించారు. 2014లో మొత్తం 26 లోక్సభ సెగ్మెంట్లను క్లీన్ స్వీప్ చేశారు కమలనాథులు. ఈసారి కూడా అదే పరంపర కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే బలమైన నాయకులనే బరిలోకి దింపాలనేది పార్టీ పెద్దల ఆలోచన. మరి జామ్నగర్ స్థానం ఆశిస్తున్న జడేజా సతీమణి రివాబా ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి. అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది.