ముఝే బాహర్ నిఖాలో : దాహం అని అరుపులు.. శిథిలాల కింద బాలిక నరకయాతన
ముంబై : భారీ వర్షాలతో ముంబై జలదిగ్భందంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్ వేలు, ఇళ్లలోకి నీరు చేరడంతో ముంబైకర్లు నానా అవస్థలు పడుతున్నారు. పింపిరీపాడలో గోడ కూలడంతో 18 మంది చనిపోయారు. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఆచూకీ కనిపించని వారి కోసం గాలిస్తున్నారు.
శిథిలాల కింద ..
ఉత్తర ముంబైలోని పింపిరీపాడ వద్ద గోడ కూలింది. అయితే దాని పక్కనే ఉన్న వారు విగతజీవులుగా మారారు. ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద ఉన్న వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద ఓ పదేళ్ల బాలిక కూడా ఉంది. అర్ధరాత్రి గోడ కూలగా .. దాదాపు రాత్రి 2 గంటల నుంచి ఆ శిధిలాల కింద సంచితా అనే చిన్నారి ఉంది.
కాపాడండి ..
కూలిన గోడ శకలాలను భద్రతా సిబ్బంది ఒక్కొక్కటిగా తీస్తుననారు. అయితే అందుల్లోంచి ఓ చిన్నారి గొంతు వినిపిస్తోంది. ఏడుస్తూ 'ముఝే బాహర్ నిఖాలో‘ అనే గొంతు వినిపించడంతో వేగంగా చేపట్టారు. శిధిలాల కింద .. చీకటిలో ఉన్న చిన్నారి భయపడి తనను కాపాడాలని కంటిన్యూగా ఆరుస్తోంది. గత కొన్ని గంటలుగా దాహం వేస్తుందని, మంచినీళ్లు ఇవ్వమని కోరుతుంది. మరోసారి తనను బయటకు తీయాలని వేడుకుంటుంది. కొన్ని గంటల తర్వాత ఎట్టకేలకు ఆ శిథిలాల నుంచి సంచితను కాపాడారు. తనకు మరో జన్మ వచ్చినట్టుందని ..బయటకొచ్చి కన్నీరు మున్నీరుగా విలపించింది ఆ బాలిక.
సునామీ వచ్చిందా ?
పింపిరీపాడలో గోడ కూలడంతో అక్కడున్న వారు ఏమైంది అని ఆశ్చర్చపోయారు. నగరంలో భారీ తుఫాన్, లేదంటే తీరంలో సునామీ వచ్చిందా ? అనే స్థాయిలో శబ్ధం వచ్చిందని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. వర్షంతో ముంబై రహదారులపైకి భారీగా నీరు చేరింది. దీంతో ఆ గోడ ఒత్తిడికి గురై కూలిపోయి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ గోడ ఎవరిదనే అంశంపై క్లారిటీ రాలేదు. ఇది అటవీశాఖకు చెందినదని ఒకరు, ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు చెందినదని మరొకరు, మహింద్ర అండ్ మహింద్ర కంపెనీకి చెందినదని మరొకరు చెప్తున్నారు. అయితే శుక్రవారం నుంచి కురుస్తోన్న వర్షాలతో ముంబైలో చనిపోయిన వారి సంఖ్య 44కి చేరింది. క్షతగాత్రులు కూడా పదుల సంఖ్యలో ఉంటారని స్థానిక అధికారులు చెప్తున్నారు. మరోవైపు వర్షాలతో దాదాపు 54 విమాన సర్వీసులను దారి మళ్లించిన సంగతి తెలిసిందే. ఇటు కొన్ని రైళ్లను దారి మళ్లించగా .. మరికొన్నింటిని రద్దు చేశారు.