అమర వీరుడి పార్థికవదేహంతో సెల్ఫీ దిగుతారా? కేంద్రమంత్రి తీరుపై విమర్శలు
తిరువనంతపురంః ఈ ఫొటో ఉన్నది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫోన్ కన్నన్థనమ్. కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైన భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు. ఆయన వెనక కనిపిస్తున్నది సీఆర్పీఎఫ్ అమర జవాను పార్థివ దేహాన్ని ఉంచిన పేటిక. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడుల్లో అమరులైన 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో వీవీ వసంత్ కుమార్ పార్థివ దేహాన్ని ఉంచిన పేటిక అది.
ఈ ఫొటోను అల్ఫోన్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వసంత్ కుమార్ పార్థివ దేహానికి గుడ్ బై చెబుతూ కామెంట్ చేశారు. నీ వల్లే మేమంతా జీవించి ఉన్నాం అని రాశారు. అంతే! ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అమర వీరుని పార్థివదేహం వద్ద అల్ఫోన్స్ సెల్ఫీ తీసుకున్నారంటూ విమర్శలు వచ్చాయి. కేంద్ర మంత్రి అమర వీరుని పార్థివ దేహం వద్ద సెల్ఫీ దిగారంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఆయన వైఖరిని తప్పుపట్టారు. దీనిపై అల్ఫోన్స్ వివరణ ఇచ్చుకునే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఫొటో సెల్ఫీ కాదని అల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు. తన ఫేస్ బుక్ ఖాతా నుంచి దాన్ని తొలగించారు.
పుల్వామా అమర వీరుల పార్థివ దేహాలను ఆయా రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- అల్ఫోన్స్ కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో వసంత్ కుమార్ పార్థివ దేహాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కొందరు అబిమానులు ఈ ఫొటో తీశారని అల్ఫోన్స్ చెబుతున్నారు. ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. నెటిజన్లు పట్టించుకోలేదు. విమర్శల జడివాన కురిపించారు.
అమర వీరుని పార్థివ దేహం వద్ద సెల్ఫీ తీసుకుంటారా? సిగ్గులేదా అల్ఫోన్స్ కన్నన్థనమ్.. అంటూ షాన్ షకీర్ అనే వ్యక్తి విమర్శించారు. మీరు సిగ్గుపడుతున్న దృశ్యం సరిగ్గా కనిపించట్లేదు. మంచి కెమెరాను వినియోగించి ఉండాల్సింది సర్.. అంటూ పరేష్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. నార్సిజం పతాక స్థాయికి చేరుకుంది. రాజు (నరేంద్రమోడీ)కు తగ్గట్టే కేంద్రమంత్రులు కూడా.. అని అంటూ బిజోయ్ కామెంట్స్ చేశారు.
ఈ విమర్శలు వెలువడిన తరువాత అల్ఫోన్స్ ఈ ఫొటోను డిలెట్ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి దాన్ని తొలగించారు. ఆ ఫొటోను జాగ్రత్తగా గమనించండి. అది సెల్ఫీ కాదు. నాకు సెల్ఫీలు దిగే అలవాటు లేదు. సెల్ఫీలు దిగను.. అని అల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు.
ఇలాంటి ఫొటోల విషయంలో అల్ఫోన్స్ నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడం కొత్తేమీ కాదు. గతంలో కేరళను ముంచేసిన వరదల సమయంలోనూ ఆయన దిగిన కొన్ని ఫొటోలు నెటిజన్లకు టార్గెట్ అయ్యాయి. బ్లూజీన్స్, బ్లూ టీ షర్ట్ ధరించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఫొటో ఒకటి అప్పట్లో దుమారం రేపింది. సహాయక చర్యలు, శిబిరాలను చూడ్డానికి వచ్చారా? లేక పిక్నిక్కు వచ్చారా? అంటూ నెటిజన్లు విమర్శించారు. ఆయనే మరోసారి టార్గెట్ కావడం కాకతాళీయమే.