కారు సీట్లో నోట కట్టలు..కోట్ల రూపాయలు: తళతళలాడే రూ.500 నోట్లు
భువనేశ్వర్: ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉన్న ఖరీదైన టయోటా కారు అది. ఆగ్రా నుంచి దాదాపు నాలుగు రాష్ట్రాల సరిహద్దులను దాటుకుంటూ ఒడిశాలోని కటక్ నగరానికి చేరింది. అక్కడి నుంచి ఛత్తీస్ గఢ్ వెళ్లాల్సి ఉంది. ఒడిశాలోని మహాసముంద్ జిల్లా ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. మహా సముంద్ జిల్లా నుంచి ఛత్తీస్ గఢ్ వెళ్లే మార్గంలో ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రొటీన్ గా కార్లను తనిఖీ చేస్తుండగా.. ఈ కారు అనుమానాస్పదంగా వారి కంట పడింది.
ఉత్తర్ ప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉండటం, అందులో ఉన్న వారు కూడా అదే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో పోలీసులు కారును క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు కారులో ఉన్నవారు పొంతన లేని సమాధానాలు చెప్పడం పోలీసులను మరింత అనుమానాల్లోకి నెట్టింది. దీనితో వారు కారు అణువణువూ గాలించగా.. తళతళలాడుతున్న కొత్త నోట్ల కట్టలు వారి కంట పడ్డాయి. వాటి విలువ 10 కోట్ల 90 లక్షల రూపాయలు.
కారు సీటుపై ఉన్న కవర్ ను తొలగించి, అందులో నోట్ల కట్టలను నింపేశారు. అనంతరం సీటును యధాస్థితికి తీసుకొచ్చి, ప్రయాణం సాగించారు. అన్నీ 500 కొత్త రూపాయల నోట్లే. కారులో ప్రయాణిస్తున్న బన్వరీ (40), ప్రహ్లాద్ (30), మహమ్మద్ ఇబ్రహీం (45), అతని భార్య నజ్మా (35)లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17వ తేదీన ఆగ్రా నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ కు వెళ్తున్నామని మాత్రమే చెబుతున్నారు తప్ప, ఎక్కడికనేది చెప్పట్లేదని అన్నారు. ఈ కేసును ఒడిశా, ఛత్తీస్ గఢ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తు చేస్తున్నారు.