మోడీ కేబినెట్లో ఇంతమందిపై క్రిమినల్ కేసులు..అత్యంత ధనవంతులైన మంత్రి ఎవరంటే..?
ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఇందులో 57 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసా..? ఈ మంత్రి వర్గంలో అత్యంత ధనవంతమైన మంత్రి ఎవరో తెలుసా..?
22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
ప్రధాని నరేంద్ర మోడీ జంబో కేబినెట్ రెడీ అయ్యింది. మంత్రులుగా 57 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో దాదాపు 39 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అంటే 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. ఇది ఎన్నికల సందర్భంగా వారు ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్లో రికార్డు అయి ఉన్నాయి. ఇందులో 16 మంది మంత్రులపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. అంటే ఉగ్రవాదం, హత్య, అత్యాచారం, దోపిడీ, భూకబ్జా, మతకలహాలు, ఎన్నికల నియమాలు ఉల్లంఘన, కిడ్నాప్లాంటి సీరియస్ కేసులు ఉన్నాయి.
ఎవరెవరిపై ఎలాంటి క్రిమినల్ కేసులున్నాయి..?
ఆరుగురు మంత్రులు ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలు తమపై కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు. ఇందులో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, మతకలహాల కేసు, జాత్యాంహకార కేసు, ఇతర కేసులు ఉన్నట్లు, కావాలనే గొడవలు సృష్టించడం, మతవిశ్వాసాలను కించపరచడం లాంటి కేసులు వీరిపై నమోదై ఉన్నాయి. ముగ్గురు మంత్రులు అశ్విని కుమార్ చౌబే, నితిన్ గడ్కరీ, గిరిరాజ్ సింగ్ లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ వీ మురళీధరన్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈయన మోడీ కేబినెట్లో విదేశీవ్యవహారాల సహాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయశాఖ బాధ్యతలు చేపట్టారు.
91శాతం మంది మంత్రులు కోటీశ్వరులే
ఇక మోడీ కేబినెట్లో దాదాపు 91శాతం మంది మంత్రులు కోటీశ్వరులుగా ఉన్నారు. అంటే 57 మంది మంత్రుల్లో 51 మంది మంత్రులు కోటీశ్వరులే. ఇందులో కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ అత్యంత ధనవంతురాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆమె ఆస్తుల విలువ రూ.217 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది.ఇక సగటున ప్రతి మంత్రి రూ.14.72 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నలుగురు మంత్రులు తమ ఆస్తులు రూ.40 కోట్లు కంటే ఎక్కువగా డిక్లేర్ చేశారు. పీయూష్ గోయల్ కేబినెట్ మంత్రుల్లో రూ.95 కోట్లు ఆస్తి ప్రకటించి రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రూ.42 కోట్లతో రావు ఇందర్జిత్ సింగ్ మూడో ధనవంతుడిగా నిలిచారు. ఇక ఐదు మంది మంత్రులు తమ ఆస్తులు రూ.ఒక కోటికంటే తక్కువగా ప్రకటించారు. కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి తన ఆస్తుల విలువ 13 లక్షలుగా ప్రకటించారు.
47 మంది మంత్రులు డిగ్రీ ఆపై చదువులే చదివారు
ఇక చదువుల విషయానికొస్తే.... 14శాతం మంది మంత్రులు అంటే 8 మంది మంత్రులు 10 నుంచి 12వ తరగతి వరకే చదువుకున్నట్లు తెలిపారు. 84 శాతం మంది మంత్రులు అంటే 47 మంత్రులు తమ విద్యార్హతను డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువగా చూపించారు. ఒక మంత్రి డిప్లొమా ఉన్నట్లు తెలిపారు. 20శాతం మంది మంత్రులు అంటే 11 మంది మంత్రుల వయస్సు 41 నుంచి 50 ఏళ్లుగా ఉంది. మరోవైపు 80 శాతం మంది మంత్రులు అంటే 45 మంది మంత్రుల వయస్సు 51 నుంచి 70 ఏళ్లుగా ఉంది. ఇక కేంద్రమంత్రుల్లో 11శాతం అంటే 6 మంది మహిళా మంత్రులు ఉన్నారు.
ఈ లెక్కలన్నీ నేషనల్ ఎలక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు 58 మంత్రులు ఉన్న కేబినెట్లో 56 మంది మంత్రులకు సంబంధించిన విషయాలను వెల్లడించాయి. అయితే రామ్విలాస్ పాశ్వాన్, ఎస్ జైశంకర్లకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. వీరిద్దరూ ఇంకా ఏ సభకు ఎన్నుకోబడలేదని వివరించింది ఏడీఆర్ సంస్థ.