ఉపేంద్ర కేపీజేపీ పార్టీలో విభేదాలు, కోర్ కమిటీ సభ్యులు ఫైర్, హీరో బహిష్కరణ ? మీటింగ్ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారీ ఊహాగానాల మధ్య తెర మీదకు వచ్చిన స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, ప్రముఖ దర్శకుడు ఉపేంద్ర కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ)లో అప్పుడే విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ విభేదాలు ఎంతటికి దారితీస్తున్నాయంటే హీరో ఉపేంద్రను పార్టీ నుంచి బహిష్కరించాలనే చర్చల వరకు వచ్చింది.
ప్రజలే నాయకులు
కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)ని స్థాపించిన హీరో ఉపేంద్ర తన పార్టీలో ఎవ్వరూ నాయకులు లేరని, ప్రజలు, కార్యకర్తలే నిజమైన నాయకులు అని హీరో ఉపేంద్ర అన్నారు. ప్రజలు ఎంపిక చేసిన వారే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు.
నెల రోజుల్లో హీరో !
హీరో ఉపేంద్ర ఓ ట్వీట్ చేస్తూ కేపీజేపీ పరీక్షల ఫలితాలు మార్చి 6వ తేదీన విడుదల అవుతాయని తన అభిమానులు, పార్టీ కార్యకర్తలను అలర్ట్ చేశారు. అయితే పార్టీ ఫలితాలకు ముందే కేపీజేపీలోని నాయకుల మధ్య విభేదాలు వచ్చాయని స్పష్టంగా వెలుగు చూసింది.
ఉపేంద్ర ఏకపక్ష నిర్ణయం
శాసన సభ ఎన్నికల టిక్కెట్ లు పంపిణి విషయంలో, కమిటీలు వేసే విషయంలో ఉపేంద్ర మమల్ని సంప్రధించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేపీజేపీ కోర్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు మహేష్ గౌడ పార్టీ నాయకుల అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
పార్టీ నా సొంతంకాదు
కేపీజేపీ అనేది తన సొంత పరిశ్రమ (పార్టీ) కాదని, కార్మికులు కలిసి ఏర్పాటు చేసిన పరిశ్రమ అని హీరో ఉపేంద్ర అంటున్నారు. కష్టపడి పని చేసే వ్యక్తులే శాసన సభఎన్నికల్లో పోటీ చెయ్యాలి అనేదే నా వాదన, అంతే కాని నామాటే అందరూ వినాలి అని తాను ఎప్పుడు చెప్పలేదని, అలా ప్రవర్తించలేదని హీరో ఉపేంద్ర అంటున్నారు.
హీరో ఉపేంద్ర బహిష్కరణ ?
డబ్బు, పేరు ప్రతిష్టలు తనకు అవసరం లేదని, సిద్దాంతాలను అనుసరించి పని చెయ్యాలని, ప్రజల మద్దతు ఉస్తుందనే వారితో చేతులు కలిపామని, అయితే కోర్ కమిటీ సభ్యులు తనను బహిష్కరించాలని నిర్ణయిస్తే వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూద్దాం అని హీరో ఉపేంద్ర చెప్పారు.