క్రైసిస్లో రాహుల్ గాంధీ: ఆ డజను మంది ఎవరు?
రాహుల్ గాంధీ నాయకత్వంపై కాంగ్రెసు నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు. అయితే, రాహుల్ చుట్టూ ఉండే డజను మందిపై కిశోర్ చంద్రదేవ్ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెసు పార్టీలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. పంజాబ్లో కాంగ్రెసు విజయం సాధించినప్పటికీ ఆయనకు ఊరట లేదు. పంజాబ్లో కాంగ్రెసు విజయాన్ని అధికార పక్షం వైఫల్యానికి అన్వయిస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావమే రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలకు కారణమవుతోంది. యుపిలో సమాజ్వాదీ పార్టీతో (ఎస్పీతో) పొత్తు పెట్టుకుని నెగ్గుకురావాలని చేసిన ప్రయత్న బెడిసి కొట్టింది. పైగా, ఎస్పీ పరాజయాన్ని కూడా రాహుల్ గాంధీకే అంటగడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన నాయకత్వంపై కాంగ్రెసు పార్టీలోనే అంతర్గతంగా చర్చ సాగుతోంది.
రాహుల్ గాంధీ నాయకత్వానికి పనికివస్తారా, రారా అనే విషయాన్ని వారు సూటిగా చెప్పకపోయినప్పటికీ మార్పును ఆశిస్తున్నట్లు మాత్రం మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీని నొప్పించకుండానే అయినా చేయాల్సిన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆ డజను మంది నుంచి బయటపడాలని మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. ఆ డజను మంది ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రియాదత్ ఇలా ట్వీట్...
ప్రియా దత్ ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ను నాశనం చేస్తోంది కాంగ్రెస్ నాయకులేనని ఆమె అన్నారు. తాజాగా ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు కూడా గళమెత్తారు. పార్టీ బతికి బట్ట కట్టాలంటే ముఖస్తుతి చేసేవారిని దూరంగా ఉంచాలని సలహా ఇచ్చారు.
మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇలా...
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చుట్టూ చేరిన డజను మంది నుంచి బయటపడాలని కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖల మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ అన్నారు. బతికి బట్ట కట్టాలంటే ఇది అవసరమని తెలిపారు. ఈ డజను మంది ఆచరణలో ఎటువంటి జవాబుదారీతనం లేనివారేనని, వీరిపైనే పార్టీ ఆధారపడుతోందని అన్నారు. వీరిలో చాలా మంది పార్టీని పణంగా పెట్టి, తమకంటూ సొంత ఇష్టాయిష్టాలను ఏర్పరచుకున్నారని అన్నారు. వారు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు.
వారిలో దిగ్విజయ్ సింగ్ కూడా...
ఆ డజను మంది నేతలే కుర్చీల ఆట ఆడుతున్నారని, ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రానికి ఇన్ఛార్జులుగా వెళ్తున్నారని కిశోర్ చంద్రదేవ్ అన్నారు. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతోందన్నారు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీకి తెలుసునని, పార్టీ సమావేశాల్లో కూడా ఆయన చెప్పారని తెలిపారు. అయితే వీరిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాదని, బిలియన్ డాలర్ల ప్రశ్న అని నిట్టూర్చారు. ఆ డజను మంది దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారనేది అర్థమవుతోంది. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు
అశ్వినీ కుమార్ ఇలా అన్నారు...
ఇంత వరకు జరిగిన పొరపాట్లను పార్టీ అంగీకరించాలని, బాధ్యతగలవారు వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఇష్టపడాలని న్యాయ శాఖ మాజీ మంత్రి అశ్వని కుమార్ అన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకోవడానికి అనుగుణంగా కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల అవసరమైన ప్రతి విషయాన్నీ పరిశీలించవలసిన అవసరం ఉందన్నారు.
రాహుల్ను మార్చాలా...
రాహుల్ గాంధీని మార్చాలా అనే ప్రశ్నకు అశ్వని కుమార్ సమాధానాన్ని దాటవేశారు. తాను చెప్పాలనుకున్నది చెప్పానని మాత్రమే అన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న నాయకత్వాన్ని సాగనంపే ప్రక్రియను చేపట్టవలసిన అవసరం కాంగ్రెస్కు ఉందన్నారు. ముఖస్తుతిని విదేయత అనుకుంటే నాయకులను సృష్టించలేరని అభిప్రాయపడ్డారు. మేధావులు తగ్గుతూ ఉంటే పార్టీని గొప్పగా తయారు చేయడం సాధ్యం కాదని అన్నారు.
డిగ్గీపై రేణుకా చౌదరి ఇలా....
గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించిన విధానం తెలివితక్కువ తనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. పార్టీ గోవా వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మూర్ఖత్వం వల్లే ఇదంతా జరిగిందని ఆమె మండిపడ్డారు. తక్షణం ఆయనను పార్టీ గోవా ఇన్ చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో పాతుకపోయిన నేతలే...
కిశోర్ చంద్రదేవ్ అభిప్రాయాన్నే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నేత మర్రి శశిధర్ రెడ్డి మరో రూపంలో వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాతుకపోయిన నేతలను వారి వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల ఇంచార్జీలను కూడా మార్చేయాలని సూచించారు. దేశంలోకి కాంగ్రెసు బలోపేతానికి 1963 నాటి కామరాజ్ ప్లాన్ -2ను అమలు చేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు సిడబ్ల్యుసీ సభ్యులంతా రాజీనామా చేయాలని కూడా అన్నారు. పార్టీలో సమర్థులైన యువకులకు అవకాశం కల్పించాలని అన్నారు.