Crocodile Attack: బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. ఎక్స్ రే తీయించిన అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్ లో ఓ బాలుడిని మొసలి నీటిలోకి లాక్కెల్లింది. ఈ ఘటన దేవా నదిలో జరిగింది. ఆదివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో యూపీ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మెహర్బన్నగర్ గ్రామానికి చెందిన మీనాదేవి, శోభాప్రసాద్ దంపతుల కుమారుడైన 11 ఏళ్ల వీర్ సింగ్ గేదెలను మేపేందుకు దేవా నది ఒడ్డుకు వెళ్లాడు.అకస్మాత్తుగా గేదె దేవహా నదిలోకి ప్రవేశించింది. అతడు గేదెను బయటకు తరిమేందుకు నదిలోకి దిగాడు. అక్కడే కాచుకోని ఉన్నమొసలి బాలుడిని నీటిలోకి లాక్కెళ్లింది.
స్థానికులు బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. డైవర్లు రోప్ నెట్ తో నదిలోకి దూకారు. గంటల తరబడి శ్రమించి, డైవర్లు మొసలిని నీళ్లలోంచి నెట్లో బంధించి బయటకు తీశారు. సమాచారం మేరకు ఖతిమా అటవీ శాఖ ట్రైనీ ఐఎఫ్ఎస్ డి.నాయక్, అటవీ అధికారి రాజేంద్ర సింగ్ మన్రాల్, ఇతర అటవీ ఉద్యోగులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మొసలి బాలుడిని మింగిందేమో అనే అనుమానంతో.. ఖతిమా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఎక్స్ రే తీయించారు. మొసలి కడుపు ఖాళీగా ఉందని అటవీ అధికారులు తెలిపారు. నదిలో చాలా మొసళ్లు ఉన్నాయని.. మరొక మొసలి మింగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ప్రకటించారు. వీర్ సింగ్కు అన్నయ్య దీపాంశు అయు (18), ఇద్దరు సోదరీమణులు సీమ (15), అంజలి (14) ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.