ప్రియాంక గాంధీ మొసలికన్నీరు: యూపీ ప్రజలు జాగ్రత్తంటూ మాయావతి తీవ్ర విమర్శలు
పాట్నా: కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ వాద్రాపై బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో 110 మంది శిశువు చనిపోతే ఎందుకు స్పందించలేదంటూ ప్రియాంకను నిలదీశారు. శనివారం వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు.
ద్వంద్వ ప్రమాణాల వల్లే ఉద్రిక్తత..
కాంగ్రెస్, బీజేపీ, ఇతర ఏదైనా రాజకీయ పార్టీలా తాము చిల్లర రాజకీయాలు చేయమని మాయావతి అన్నారు. ఏ విషయంపైనైనా తాము ఇలా రెండు నాల్కల దోరణినీతో ద్వంద్వ ప్రమాణాలు పాటించమని వ్యాఖ్యానించారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల వల్లే దేశంలో హింస, ఉద్రిక్తత పరిస్తితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కోట ఇంత దారుణం జరిగినా..
కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇప్పటికీ తమ ద్వంద్వ ప్రమాణాలను ఇంకా వీడటం లేదని మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ప్రభుత్వ ఆస్పత్రిలో వందకు పైగా శిశువుల మరణాలు సంభవిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై ఏమాత్రం స్పందించలేదు. ఇవి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన మరణాలు కావా? అని ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీ మొసలి కన్నీరు
అంతేగాక, నేరుగా ప్రియాంక గాంధీపై మాయావతి విమర్శలు ఎక్కుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. మరి రాజస్థాన్ రాష్ట్రంలో వందమందికిపైగా శిశువులు మరణిస్తే అక్కడికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఆ తల్లుల కన్నీటిని ఎందుకు తుడవలేదని ప్రశ్నించారు. ఆమె కూడా ఒక తల్లే కదా అని వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.
ప్రియాంకతో యూపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
జనవరి 2న కూడా ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకుని మాయావతి విమర్శలు గుప్పించారు. కోట ప్రభుత్వ ఆస్పత్రిలో వందమంది శిశువు మరణిస్తే ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి ఆమె అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. అదే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే మొసలి కన్నీరుకార్చేదని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లో పలువురు బాధితులను పరామర్శించిన ప్రియాంక గాంధీది అవకాశవాద రాజకీయమే అవుతుందని అన్నారు. ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులతో అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు మాయావతి పిలుపునిచ్చారు.