పంట కాల్చివేత: ఢిల్లీనే కాదు, ఉత్తరాదితోపాటు దక్షిణాదిపైనా కాలుష్య ప్రభావం, పద్ధతి మారకుంటే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఊపిరాడకుండా చేసే పొగతో రాజధాని ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు రాజధాని పరిసర ప్రాంతాల్లోని పంటను కాల్చివేయడం ద్వారా వచ్చే పొగ ఢిల్లీపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాలను సైతం ఈ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతేగాక, వాతావరణం కూడా వేడెక్కేలా చేస్తోంది. వర్షాకాలం తర్వాత రైతులు తమ పొంట(పంట మిగుళ్ల)లను కాల్చివేయడంతో పొగతోపాటు మంటలు వాతావరణంలో కాలుష్యాన్ని, వేడిని పెంచుతున్నాయి. ఈ కాలుష్యం, వేడి ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలపైనా ప్రభావం చూపుతున్నాయి.
2017లో కాలుష్యం కారణంగా ఢిల్లీలో కొద్ది రోజులు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వాసులు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2003-2017 వరకు వివిధ వర్గాల ద్వారా సేకరించిన అంశాలను విశ్లేషిస్తే.. ఢిల్లీతోపాటు ఇండో-గ్యాంగ్టక్ ప్రాంతం, మధ్య భారత రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ కాలుష్యంతో బాధపడుతున్నాయని తేలింది. ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలు కాల్చడం వల్ల దక్షిణాదిలోని ఒడిశా, తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి. ఈ మేరకు వివరాలను నాసా గొద్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో స్టడీ రీసెర్చ్ లీడ్ రచయిత సుదీప్తా సర్కార్ తన అధ్యయనంలో గుర్తించారు.
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రుత్ డీ ప్రైస్ స్పందిస్తూ.. ఈ అధ్యయనం అనేది ప్రభుత్వాలను మేల్కొలిపే పిలుపని అన్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పంటలను కాల్చివేసే ప్రక్రియను నియంత్రించాలని సూచించారు.
వర్షాకాలం పంటలు పూర్తయిన తర్వాత పంటలను కాల్చడం అనేది కాలుష్యానికి కారణమవుతోందని, ఉత్తరాది ప్రజలు పీల్చుకునే గాలిలో స్వచ్ఛత లేకుండా చేస్తోందని అన్నారు. పంటలను కాల్చకపోవడం దీనికి పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఏప్రిల్-మే, అక్టోబర్-నవంబర్ నెలల మధ్య ఏడాదికి రెండు సార్లు ఇలా పంటలను కాల్చివేయడం ద్వారా గాలి కాలుష్యం అవడంతోపాటు వాతావరణం వేడిమికి కారణమవుతోంది. వేసవి, శీతకాలంలో వాతావరణ పరిస్థితులను ఇవి మార్చేస్తున్నాయని చాప్మన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అధ్యయన సలహదారు రమేష్ సింగ్ తెలిపారు.
ఏడాదికి రెండు సార్లు పంటలను కాల్చడం ద్వారా వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, అలాగే శీతాకాలంలో చలి కూడా తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. పొగమంచు తీవ్రత పెరుగుతోందని చెప్పారు.
నాసాకు చెందిన మోడరేట్ రిసెల్యూషన్ ఇమేజింగ్ స్పెక్రటోరాడియోమీటర్ (ఎండీఐఎస్) నుంచి సర్కార్, సింగ్, ఉత్తరప్రదేశ్లోని శారద యూనివర్సిటీ విద్యార్థి అకాంక్ష చౌహాన్ వివరాలను సేకరించారు. 2003-2017 మధ్య కాలంలో అక్టోబర్-నవంబర్ నెలల్లో ఉత్తరాది రాష్ట్రాలు (పంటలు)మండిపోతున్నాయని గుర్తించారు.
ఈ మంటల కారణంగా వాతావరణంలో కాలుష్యం పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగుతున్నాయని తెలిపారు. 2010 నుంచి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా భారీగా పంటలను కాల్చడం జరుగుతోందని గుర్తించారు.
ఉత్తరాదిన పంటలను కాల్చడం ద్వారా వచ్చే కాలుష్యం, వేడిమి ప్రభావం ఈస్టర్న్ ఇండో-గ్యాంగ్టక్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దక్షిణాదిలోని ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉంటోందని తెలిపారు. నవంబర్ రెండో వారం నుంచే ఈ ప్రభావం మరింత ఎక్కువవుతోందని తెలిపారు.
ఈ కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్నారు. 1986లో మొదలైన ఈ పంటలు కాల్చేయడం అనే ప్రక్రియ రోజు రోజుకు పెరిగి ఇప్పుడు చాలా రాష్ట్రాలకు వ్యాపించింది. వచ్చే పంట కాలానికి సిద్ధంగా ఉంచాలనే ఆలోచనతో రైతులు పంటలను కాలుస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
వియత్నాం, చైనా, కెనడా లాంటి దేశాల్లో ఈ పద్ధతిని కట్టడి చేసినప్పటికీ.. మనదేశంలో మాత్రం నియంత్రించకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. అయితే ఇక్కడి పరిస్థితులు కొంత భిన్నమని తెలిపారు.
పంటలను కాల్చడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాల(యంత్రాల) ద్వారా తొలగిస్తే ఈ కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉందని వారు చెప్పారు. ఈ ప్రక్రియ కొంత వ్యయంతో కూడుకున్నది కావడంతో.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు అవగాహన కల్పించి సరైన మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇదే పరిణామం కొనసాగితే మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.