చేతివాటం: ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటీశ్వరుడు
ఇండోర్: ఓ సాధారణ కానిస్టేబుల్ ఆస్తుల విలువ తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు. ప్రతి రోజు ట్రాఫిక్ సిగ్నల్స్ లో నిలబడి ఆయన గారు రూ. ఐదు కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని లోకాయుక్త అధికారులు గుర్తించారు.
మధ్యప్రదేశ్ లో సంచలనం కలిగించిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇండోర్ లో అరుణ్ సింగ్ అనే ఆయన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఉద్యోగం ముసుగులో అక్రమంగా ఆస్తులు సంపాధించాడని ఆరోపణలు వచ్చాయి.
ఈయన మీద లోకాయుక్త అధికారులు నిఘా వేశారు. సోమవారం ఉదయం అరుణ్ సింగ్ ఇంటి మీద దాడులు చేశారు. అంతే లోకాయుక్త అధికారుల దిమ్మె తిరిగింది. సోమవారం మద్యాహ్నం వరకు అరుణ్ సింగ్ కు చెందిన రూ. ఐదు కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు.
ఇండోర్ నగరంలో ఆరు వేల చదరపు అడుగుల చొప్పున ఉన్న రెండు ఫ్లాట్ లు, ఫాం హౌస్, రెండు ఫ్లాట్ ల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రేవా నగరంలో 25 ఎకరాల ఫాం హౌస్, 8 వేల చదరపు అడుగుల చొప్పున రెండు ఫ్లాట్లు, రెండు ఇళ్ల డాక్యూమెంట్లు గుర్తించారు.
అరుణ్ సింగ్ కు చెందిన నాలుగు విలాసవంతమైన కార్లు, 8 బ్యాంక్ అకౌంట్స్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ సింగ్ బ్యాంకు లాకర్లు పరిశీలించవలసి ఉందని, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. ఐదు కోట్లు ఉంటుందని లోకాయుక్త అధికారులు తెలిపారు.