ఎన్నికల వేడి: రాకెట్లు కూడు పెట్టవ్: చంద్రుడిని అందుకోవడం కాదు..నిరుద్యోగులను ఆదుకోండి: రాహుల్
ముంబై: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ రెండు చోట్లా అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ.. వరుసగా రెండోసారి గద్దెనెక్కాలనే వ్యూహాలు రచిస్తోండగా.. కాషాయ పార్టీని ఖంగు తినిపించడానికి కాంగ్రెస్ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఈ రెండు పార్టీల ప్రచార పర్వాలు, ప్రదర్శనలు, రోడ్ షోలతో మహారాష్ట్ర, హర్యానా హోరెత్తిపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఒకే రోజు ఒకే రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రసంగించారు.
బీజేపీ వైఫల్యాలపై..
బీజేపీ వైఫల్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు, స్థూల జాతీయోత్పత్తి క్షీణించడం, నిరుద్యోగ సమస్య మితి మీరడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 వైఫల్యాన్ని కూడా మినహాయించట్లేదు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ఆయా అంశాలతో పాటు స్థానిక బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలనూ కేంద్ర బిందువుగా చేసుకుంది కాంగ్రెస్.
అందుకోవాల్సింది చంద్రుడిని కాదు..
మహారాష్ట్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా భావించే లాతూర్ లో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. చంద్రయాన్-2 వైఫల్యాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. నిరుద్యోగ సమస్యతో దీనికి లింకు పెట్టారు. చంద్రుడిని అందుకోవాలనే తపనలో ప్రధానమంత్రి నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టకుండా చంద్రుడిని అందుకోవాలని తపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని గుర్తు చేశారు.
రాకెట్లు.. అన్నం పెట్టవ్..
యువతకు ఉద్యోగాలను కల్పించాలనే కనీస ధ్యాస లేకుండా..చంద్రుడి మీదికి రాకెట్లను పంపించడంలో ప్రధాని బిజీగా ఉన్నారని చురకలు అంటించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుడి మీదికి రాకెట్లను పంపించడం వల్ల కోట్లాదిమంది నిరుద్యోగులకు ఉపాధి లభించబోదని అన్నారు. తమ పార్టీ స్థాపించిన ఇస్రో సాధించిన ఘన విజయాలను తన ఒక్కడి ఖాతాలో వేసుకోవడానికి నరేంద్ర మోడీ తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. ఇస్రో శాస్త్రవేత్తల ఘన విజయాలను కూడా తనవిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
ఏం జరుగుతోందో మీకు తెలియదా? మీడియాకు చురకలు
పనిలో పనిగా రాహుల్ గాంధీ మీడియాకూ హితబోధ చేశారు. ఎంతసేపూ ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని, పాకిస్తాన్ అంశాన్ని, నరేంద్ర మోడీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఫొటో సెషన్ ను గురించి మీడియా ప్రస్తావిస్తోంది గానీ.. దేశాన్ని పట్టి పీడిస్తోన్న నిరుద్యోగ సమస్యను గానీ, ఆర్థిక మాంద్యాన్ని గానీ జనంలోకి తీసుకెళ్లట్లేదని అన్నారు. 45 సంవత్సరాల్లో ఏనాడూ లేని ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తోందని, 2000కు పైగా కర్మాగారాలు మూత పడ్డాయనే విషయం మీడియాకు తెలియదా? అని ప్రశ్నించారు. పారిశ్రామిక రంగం ఏ స్థాయిలో కుప్పకూలిపోయిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాకు ఉందని అన్నారు.