వ్యూహం మార్చిన రైతులు- దేశవ్యాప్తంగా ర్యాలీలు- ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీకి చుక్కలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 83 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వారిలో కొందరు ఇంటి బాట పడుతున్నారు. దీంతో రైతు సంఘాల నేతలు కూడా ఉద్యమం వ్యూహం మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఢిల్లీ సరిహద్దులకే పరిమితమైన ఆందోళనను ఇక రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని టార్గెట్ చేస్తూ మహా పంచాయతీలను నిర్వహించడంతో పాటు విపక్షాలను కూడా అందులో భాగస్వాముల్ని చేయనున్నారు.
ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీ: పోలీసులను విచక్షణారహితంగా కొట్టిన రైతులు, భయంతో పరుగులు
మారిన రైతుల వ్యూహం
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే విషయంలో కేంద్రం ముందుకు రాకపోవడం, చర్చల్లోనూ ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు కూడా తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్ధితి వస్తోంది. దీంతో నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వారు కూడా భావిస్తున్నారు. దీంతో కొత్త వ్యూహానికి రూపకల్పన చేస్తున్నారు. కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ రచించిన ఈ వ్యూహం బీజేపీకి పలు రాష్ట్రాల్లో చుక్కలు చూపించే అవకాశముంది.
దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, మహా పంచాయతీలు
ఇప్పటివరకూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనే ర్యాలీలు, మహా పంచాయతీలు నిర్వహిస్తున్న రైతు సంఘాలు ఇప్పుడు వాటిని దేశవ్యాప్తం చేయాలని నిర్ణయించాయి. ఇందు కోసం ఓ భారీ ప్లాన్ను రూపొందించాయి. ముందుగా రైతుల ప్రభావం అధికంగా ఉండే మహారాష్ట్ర, హర్యానా, రాజస్ధాన్లో పది రోజుల వ్యవధిలో భారీ ర్యాలీలు, మహా పంచాయతీలు నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఆ తర్వాత క్రమంగా వీటిని మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించబోతున్నాయి.
రైతుల ఉద్యమం ఇక అందరిదీ
ఇప్పటివరకూ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులు హస్తినలో చేపడుతున్న ఆందోళనలకే పరిమితమైన రైతుల ఉద్యమాన్ని ఇకపై జాతీయోద్యమంగా మార్చాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి మద్దతు పెరుగుతుండగా.. ఇప్పుడు క్షేత్రస్ధాయికి తీసుకెళ్లడం ద్వారా యువతతో పాటు ఇతర వర్గాల మద్దతు తీసుకోవాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు యువతతో పాటు స్ధానిక రాజకీయ పార్టీల సహకారంతోనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నాయి.
జాక్వలైన్ ఫెర్నాండేజ్ యోగా విన్యాసాలు.. అందంతో కవ్విస్తున్న శ్రీలంక బ్యూటీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ టార్గెట్గా...
కేవలం ఢిల్లీకి పరిమితం కాకుండా రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరించడం ద్వారా ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లో బీజేపీకి చుక్కలు చూపించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఉద్యమాన్ని ర్యాలీలు, మహా పంచాయతీల రూపంలో ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తద్వారా దేశవ్యాప్తంగా రైతులకు బీజేపీ వ్యతిరేకం అన్న సంకేతాలు వెళితే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని రైతు సంఘాలు భావిస్తున్నాయి.