తమిళనాడులో చనిపోతున్న కాకులు,కుక్కలు .. వైరస్ తోనే అని స్థానికులకు కొత్త భయాలు
తమిళనాడులో కరోనా ప్రతాపం చూపుతుంది . కరోనా విజృంభిస్తున్న వేళ తమిళనాడులో కొత్త భయాలు కూడా స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి . ఇప్పటికే తమిళనాడులో కరోనా తీవ్ర రూపం దాల్చి బాధితులకు వైద్యం చేస్తున్న వారిని కూడా పొట్టన పెట్టుకుంటుంటే ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా కరోనా వైరస్ ప్రభావమే అనుకుంటున్నారు . ఏం జరిగినా సరే కరోనా వల్లే అన్న భయం బాగా ప్రజల్లో పెరిగిపోయింది .
ఇప్పటికే 1683 మంది కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఇక 20 మంది మృత్యు వాత పడ్డారు .ఇంకా కేసులు పెరిగే పరిస్థితి తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది . ఇందులో 31 మంది పదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు. ఒక్క రోజులోనే 54 పాజిటివ్ కేసులు వచ్చాయి అంటే తమిళనాడులో పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు . ఇక తమిళనాట నమోదైన 1683 కేసుల్లో 1450 కేసులు ఢిల్లీ మర్కజ్ లింకులే కావటం గమనార్హం .
Recommended Video
ఇక తాజాగా ఒక్క రోజులో నాగపట్నం జిల్లా పూంపుహార్లో 150 కాకులు, మూడు కుక్కలు మృతి చెందాయి. ఒక్కసారిగా అంత పెద్ద సంఖ్యలో కాకులు , కుక్కలు చనిపోవటం కూడా వైరస్ వల్ల అన్న అనుమానంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. కాకుల కళేబరాల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు వీటిని పరీక్షలకు పంపారు. రిపోర్ట్స్ కోసం ఇటు అధికారులు, గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ఇక చెన్నైలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి . ఒక్క చెన్నై లోనే మొత్తం 400ల కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక కేసులు చెన్నైలో నమోదయినట్టు తెలుస్తుంది . కాకుల, కుక్కల కళేబరాల నుండి తీసిన శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే గానీ అక్కడ ప్రజలు కాస్త ఊపిరి తీసుకునేలా లేరు.