పుల్వామా దాడి: ఆ జవాను బస్సు కూడా ఎక్కాడు, చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడిన సెలవు
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో గత వారం ఉగ్రవాద దాడి జరిగి, నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ దాడిలో ఓ జవాను చివరి నిమిషంలో ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అతను మహారాష్ట్రలోని అహ్మద్ నగర్కు చెందిన థకా బేల్కర్.
ఫిబ్రవరి 14వ తేదీన ఇతర సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు అతను కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఎప్పటినుంచో ఆయన సెలవు అడుగుతున్నారు. అధికారులు చివరి నిమిషంలో అతనికి అనుమతి ఇచ్చారు. దీంతో థకా బేల్కర్ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో అతని ప్రాణాలు కూడా దక్కించుకున్నారు.
ఈ నెల 24వ తేదీన అతని పెళ్లి ఉంది. సెలవుల కోసం వెళ్లిన బేల్కర్.. తన తోటి జవాన్లు ఉగ్రదాడిలో అమరులయ్యారని తెలిసి ఆవేదన చెందారు. అతను నాలుగేళ్ల క్రితం సీఆర్పీఎఫ్లో చేరారు. ఎనిమిది నెలల క్రితం పెళ్లి కుదిరింది. ఆయన ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పెళ్లి కోసం ఇంటికి వచ్చిన అతను దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి ఆ షాక్తో ఇప్పటి వరకు తమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని, గురువారం ఇతర జవాన్లతో పాటు బేల్కర్ కూడా బస్సు ఎక్కాడని, బస్సు మరికాసేపట్లో బయలుదేరుతుందనగా అధికారులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం అందించారని, దాంతో ఇతర జవాన్లకు వీడ్కోలు చెప్పి బస్సు దిగి ఇంటికి బయలుదేరాడని, కానీ అదే వారికి చివరి వీడ్కోలు అవుతుందని బేల్కర్ ఊహించలేకపోయాడని, పెళ్లి జరగబోతోందన్న ఆనందం అతనిలో ఏమాత్రం లేదని బేల్కర్ సోదరుడు అరుణ్ చెప్పారు.