మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో అందులోని ఓ జవాను తన సహచర జవాన్లు ముగ్గురిని కాల్చి చంపాడు. అజిత్ కుమార్ అనే కానిస్టేబుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరో ముగ్గురు జవాన్లతో గొడవపడి వారిని తన సర్వీసు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన ఉదంపూర్లోని 187వ బెటాలియన్ క్యాంప్లో చోటు చేసుకుంది. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను తన సర్వీసు తుపాకీతో కాల్చి చంపిన తర్వాత అజిత్ కూడా తనను తాను కాల్చుకున్నాడని అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అజిత్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన అజిత్ కుమార్ స్వస్థలం కాన్పూర్.ఇక అజిత్ కుమార్ కాల్పులు జరపడంతో మృతి చెందిన వారిని రాజస్థాన్కు చెందిన పోకర్మాల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్యానాకు చెందిన ఉమేద్ సింగ్లుగా గుర్తించారు. ముగ్గురి మధ్య చిన్న గొడవ చిలికి చిలికి పెద్దదిగా మారిందని ఆ సమయంలో సహనం కోల్పోయిన అజిత్ కుమార్ తన దగ్గరున్న తుపాకీతో కాల్చి చంపాడని అధికారులు తెలిపారు.
పాపం పసిపాప: తల్లి మృతి చెందింది..మేనమామ కనికరించలేదు..ఈ చిన్నారి ఏంచేసింది..?
ముగ్గురు జవాన్లను అజిత్ కుమార్ తన తుపాకీతో కాల్చి చంపారన్న సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని కాల్చి తను కూడా ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేశాడు అజిత్ కుమార్. అజిత్ కుమార్ను వెంటనే దగ్గరలోని ఆర్మీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ఇక ఘటనపై మిలటరీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.