నీతి అయోగ్ భేటీ ప్రారంభం: ఏపీ సమస్యలపై 20 ని.లు మాట్లాడిన చంద్రబాబు
న్యూఢిల్లీ: కీలకమైన నీతి అయోగ్ సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం ఢిల్లీలో ప్రారంభం కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విభజన హామీలు, ఏపీ సమస్యలను ఆయన 20 నిమిషాల తన ప్రసంగంలో ప్రస్తావించారు. కేసీఆర్ కాళేశ్వరానికి జాతీయ హోదా, రైతులకు గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరుగుతోన్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ భేటీకి హాజరుకాలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఆరు అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అజెండాలోని అంశాలపై పాలక మండలి చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ముగుస్తుంది.
ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు ఏకమవుతున్న సమయంలో జరుగుతున్న నీతి అయోగ్ భేటీ చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇటీవల ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలపై నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.