కామాందుల కర్కషత్వం..! భర్త ముందే భార్యపై అఘాయిత్యం..!!
రాజస్థాన్/హైదరాబాద్ : అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు వచ్చినా ఎక్కడో చోట వర్ణించలేని ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. రాజస్థాన్ లో కామాంధులు రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనంపై ఊరికి వెళుతున్న ఓ జంటను అడ్డగించి భర్తను తీవ్రంగా కొట్టారు. అనంతరం భార్యపై అతని ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి పరారయ్యారు. దీంతో ఈ జంట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదయింది. రాజస్థాన్ లోని ఆళ్వార్ లో గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆళ్వార్ లోని లాల్ వాడీ గ్రామం నుంచి త్రల్విక్షా గ్రామానికి ఓ జంట బైక్ పై బయలుదేరింది. అయితే వీరిని రెండు మోటార్ సైకిళ్లలో కొందరు దుండగులు వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వీరి బైక్ ను అడ్డగించారు.
అనంతరం భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఓవైపు భర్తపై ఇద్దరు దుండగులు దాడిచేస్తుండగా, మరో ముగ్గురు వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం మిగిలిన ఇద్దరు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ అఘాయిత్యాన్ని వీడియోలో చిత్రీకరించిన దుండగులు, విషయం బయటకు చెబితే చంపేస్తామనీ, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఎస్సీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదుచేశారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.