సముద్ర మార్గం: ముంబై నుంచి గోవాకు నౌక సర్వీసులు..టికెట్ ఎంతో తెలుసా..?
మీరు ముంబైలో నివసిస్తున్నారా..? గోవాకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా... ఎప్పుడూ విమానం, లేదా రైలు లేదా బస్సులోనే మీరు గోవాకు వెళ్లారా... ఇప్పుడు కాస్త వెరైటీగా ట్రైచేయండి. సముద్ర మార్గంలో ముంబై నుంచి గోవాకు వెళ్లే ప్రయత్నం చేయండి. అవును ఇది నిజమే. అక్టోబర్ 11 నుంచి ముంబైలోని ప్రిన్సెస్ డాక్ నౌకాశ్రయం నుంచి ఓ పెద్ద ఓడ గోవాకు బయలుదేర నుంది. ఈ సర్వీస్ అక్టోబర్ 11 నుంచి ప్రతి రెండ్రోజులకోసారి ఉంటుంది. సముద్ర మార్గంలో అలలపై అలా ప్రయాణిస్తూ పొందే అనుభూతే వేరు.
టికెట్ ధర ఎంతో తెలుసా..?
ఇక ఈ క్రూజర్ను " సీ ఈగల్స్ క్రూజ్ "అనే ప్రైవేట్ సంస్థ ఆపరేట్ చేయనున్నట్లు ముంబై పోర్ట్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో ప్రయాణించాలంటే కాస్త కాసులు ఎక్కవగానే సమర్పించుకోవాల్సి ఉంటుంది. ముంబై నుంచి గోవాకు అయ్యే టికెట్ ధర రూ.7వేలని సమాచారం. ఇందులో ఒక స్నాక్, భోజనం, తర్వాత మధ్యలో ఏదైనా ఆహారం అందిస్తారు. అయితే ఈ ధరను అధికారికంగా యాజమాన్యం ధృవీకరించలేదు. అదే విమానంలో గోవాకు వెళితే భోజనంతో కలిపి టికెట్ ధర రూ.2500/-. కానీ సముద్రంపై ట్రావెల్ చేయడం అంటే అందులో ఓ టైపు కిక్కుంటుంది.
ప్రయాణ సమయాలు ఇలా ఉన్నాయి
అక్టోబర్ 11 నుంచి ఈ ఓడ అందుబాటులోకి వస్తుందని ముంబై పోర్ట్ ట్రస్ట్ ఛైర్మెన్ సంజయ్ భాటియా తెలిపారు. ముంబై నుంచి గోవాకు ప్రిన్సెస్ డాక్ నౌకాశ్రయంలోని డొమెస్టిక్ క్రూయిజ్ టర్మినల్ నుంచి సాయంత్రం 5 గంటలకు ఈ ఓడ బయలుదేరుతుందని భాటియా వివరించారు. ఇక గోవాకు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుందన్నారు. ఇలా రెండ్రోజులకోసారి ట్రిప్ వేస్తుందని భాటియా స్పష్టం చేశారు.
ఈ నౌక ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..?
ఈ అత్యాధునిక వసతులున్న ఈ నౌక పేరు అంగ్రియా. తొలి మరాఠా నేవీ అడ్మిరల్ కన్హోజీ అంగ్రి పేరును ఈ నౌకకు పెట్టారు. మొత్తం 400 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. ఈ భారీ నౌకలో చాలా రెస్టారెంట్లు, 24 గంటలు పనిచేసే కాఫీ షాపులు, సేదతీరేందుకు లాంజ్, డిస్కోథెక్, స్విమ్మింగ్ పూల్, స్పాలను ఏర్పాటు చేశారు. మొత్తం 104 క్యాబిన్లు ఉన్నాయి.
పర్యటక రంగం అభివృద్ధి కోసమే..
భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నౌకాయానంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ముంబై నుంచి గోవాకు సముద్ర మార్గం ద్వారా ప్రయాణికులను చేరవేసేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు కూడా సముద్ర మార్గం ద్వారా ప్రయాణం సాగించేందుకు కొన్ని ప్రతిపాదనలను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. మనదేశంలోనే కాకుండా ఆగ్నేసియా ప్రాంతాలకు కూడా నౌకలను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ముంబై, గోవా, కేరళలాంటి ప్రధాన నౌకాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటోంది.