ఆర్టికల్ 370 రద్దు : అలర్ట్గా ఉండాలని సీఎస్, డీజీపీలకు హోంశాఖ ఆదేశం, కశ్మీర్కు దోవల్
న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా మారింది. దీంతో ఇప్పటికే భారీగా భద్రతా బలగాలను కేంద్రం మొహరించింది. జమ్ముకశ్మీర్లో దాదాపు 43 వేల మంది సిబ్బంది గస్తీ కాస్తున్నారు. అనుమానిత వస్తువులు, ఆందోళన చేపట్టే వారిని ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి కశ్మీర్ వెళుతున్నారు జాతీయ భద్రతా సలహాదారు దోవల్. కశ్మీర్లో ఉండి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తారు.
టెన్షన్ టెన్షన్ ..
కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిని వ్యతిరేకిస్తూ కశ్మీర్లో అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉన్నదనే హెచ్చరికల నేపథ్యంలో భారీగా భద్రతా బలగాలను మొహరించారు. ఈ క్రమంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి కశ్మీర్ వెళ్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఎత్తివేయాలని ఆలోచన చేసినప్పుడే తొలుత అక్కడ పర్యటించారు ధోవల్. కశ్మీర్లో పర్యటించి .. పరిస్థితులను నిశీతంగా గమనించారు. ఆయన ఢిల్లీ తిరిగొచ్చాకే కశ్మీర్కు 10 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మొహరించారు. అంటే ఆర్టికల్ 370 ఎత్తేసేందుకు మోడీ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకొని .. పరిస్థితిని నిశీతంగా గమనిస్తూ ముందుకెళ్తుంది.
ఆర్టికల్ 370 రద్దు ..
ఇవాళ ఉదయం కేంద్ర క్యాబినెట్ కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాష్ట్రపతి కోవింద్ కూడా ఆమోదం తెలిపారు. తర్వాత గెజిట్ కూడా విడుదలైంది. తర్వాత ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. నాలుగు బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్పై ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 35 వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మరో 8 వేల మంది జవాన్లను పంపించారు. మరోవైపు కశ్మీర్లో ఎలాంటి హింస చెలరేగకుండా ఉండేందుకు దోవల్ మరోసారి కశ్మీర్ వెళ్తున్నారు. ఇవాళ ఆయన అక్కడ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో ఎలాంటి హింస చెలరేగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో పరిస్థితి మొత్తం తమ అదుపులో ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
అప్రమత్తం ..
మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అన్నిరాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, పోలీసు కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. శాంతి భద్రతలను కాపాడేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. హై అలర్ట్ జారీచేసి .. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. జమ్ము, కశ్మీర్ ప్రజల భద్రత, విద్యార్థులకు సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలని సూచించింది. మరోవైపు గత 15 రోజుల నుంచి కశ్మీర్లో పరిస్థితి మారిపోయింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యటనతో ఏందో జరగబోతుందనే సంకేతాలు వచ్చాయి. ఆయన కశ్మీర్ వెళ్లొచ్చాకనే 10 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. పథకం ప్రకారం విద్యార్థులను కూడా బయటకు పంపించారు. కశ్మీర్లో ఏం జరుగుతుందోననే సంకేతాలతో ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పెట్రోల్ కొనగోలు చేసి పెట్టుకున్నారు. ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా నిల్వ చేసుకున్నారు.