ఎన్డీఏ ప్రభంజనానికి ప్రధాన కారణం..?
Recommended Video
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోందంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం అంటూ కోడై కూశాయి. 2014 నాటి కంటే కూడా ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ స్పష్టం చేశాయి. దేశం మొత్తాన్నీ, ప్రత్యేకించి హిందీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు ఇంతలా ఎన్డీఏకు అండగా ఉండటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? సంక్షేమ పథకాలా? పాకిస్తాన్లోని బాలాకోట్పై భారత వైమానిక దాడులా? అవేవీ కావు. నరేంద్ర మోడీ ఒక్కరే కారణం. నరేంద్ర మోడీని చూసే తాము ఎన్డీఏకు ఓటు వేశామని చెబుతున్నారు ప్రజలు.
సీఎస్డీఎస్-లోక్నీతి నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. పార్టీని చూసి ఓటేశారా? లేక అభ్యర్థిని చూసి ఓటేశారా? అని ప్రశ్నించగా.. మోడీని చూసి ఓటేశామని జనం స్పష్టం చేశారని వెల్లడించింది. మోడీని మరోసారి ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతోనే 46 శాతం మంది బీజేపీ, లేదా ఆ పార్టీ మితృపక్షానికి ఓటు వేసినట్లు తేలింది. మరో 31 శాతం మంది ఓటర్లు స్థానిక అభ్యర్థిని చూసి ఎన్డీఏ వైపు మొగ్గు చూపించినట్లు స్పష్టమైంది. ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంపై ప్రజలు ఓ నిర్ధారణకు వచ్చారని, దాని అనుసరించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని సీఎస్డీఎస్-లోక్నీతి సర్వే అభిప్రాయపడింది.
బీజేపీకి ఓటు వేశారని భావిస్తోన్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోడీ కోసమే బీజేపీని జైకొట్టారని, అలాగే ప్రతి నలుగురిలో ఒకరు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సానుభూతిపరులు కూడా మోడీని ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతోనే ఓటు వేశామని అంటున్నారు.
దక్షిణాదిలో- రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, మహారాష్ట్రలల్లో పార్టీ ఆధారిత ఓటింగ్ నమోదైందని సర్వే స్పష్టం చేసింది. స్థానిక అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదని, పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొంది. హిందీ ప్రాబల్యం ఉన్న బిహార్, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీల్లో ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని పట్టించుకున్నారని, ఫలానా వ్యక్తి దేశాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఓటు వేశారని సర్వే వెల్లడించింది.
ప్రధానిగా నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని మరోసారి బీజేపీ ప్రతిపాదించడానికి గల కారణం కూడా ఇదేనని పేర్కొందా సర్వే. 53 శాతం మంది బీజేపీ ఓటు బ్యాంకు స్థానిక లోక్సభ అభ్యర్థి పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. మోడీ ముఖం చూసి ఓటేసినట్లు తేలింది.