'సరి-బేసి'కు ప్రతిపాదన: వారంలో ఒకరోజు 'వర్క్ ఫ్రం హోం'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి 'సరి-బేసి' నెంబర్ విధానం అమలు చేయనున్న నేపథ్యంలో జాతీయ శాస్త్ర-సాంకేతిక, అభివృద్ధి సంస్థ (ఎన్ఐఎస్టీఏడీ-నిస్టాడ్) కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.
ఈ ప్రతిపాదన ప్రకారం వారంలో ఒకరోజు (బుధవారం) విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులకు 'వర్క్ ఫ్రం హోం' ఆప్షన్ ఇవ్వడం మంచిదని ఆ సంస్థ ఓ పరిష్కారంగా సూచించింది. దీన్ని ‘వర్చ్యువల్ అటెండెన్స్ ఎట్ వర్క్ అండ్ స్కూల్' (వీఏడబ్ల్యూఎస్)గా నిస్టాడ్ డైరెక్టర్ పి. గోస్వామి వివరించారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెడితే కాలుష్యంతో పాటు ఒత్తిడి కూడా తగ్గి పని సామర్థ్యం, జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి అమలు చేయాలని భావిస్తున్న 'సరి-బేసి' నెంబర్ విధానం సక్సెస్ కాకపోవచ్చని మెక్సికో, బొగోటాల ఉదాహరించారు.
ఆయా దేశాల్లో 'సరి-బేసి' నెంబర్ విధానం ప్రవేశపెట్టినప్పుడు అక్కడి ప్రజలు రెండో కారు కోవడంతో కాలుష్యం మరింతగా పెరిగిందన్నారు. ఈ నిర్ణయంతో తగు మార్గదర్శకాలు జారీచేస్తే ‘వీఏడబ్ల్యూఎస్' విజయవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదలను ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపాటు పీఎంఓతో సహా అన్ని మంత్రిత్వ శాఖలకు పంపామన్నారు.
ఇది ఇలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న 'సరి-బేసి' నెంబర్ విధానంపై మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులకు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జనవరి 1 నుంచి 15వరకు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ఐదు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వీటిపై బుధవారం విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలోని ధర్మాసనం ఇంకా సరి-బేసి విధానం అమలు కానందువల్ల ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమంటూ విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. కనీసం ఆ రోజువరకూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల వినతిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.