అశ్లీల ఎమ్మెమ్మెస్లు: రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద కేసు
బెంగళూరు: మహిళలతో అసభ్యంగా ప్రవర్థిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసిద్ది చెందిన క్లబ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి, మహిళ ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. వీరు సమయం చిక్కినప్పుడు ఆ క్లబ్ కు వెళ్లి వారి స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతుంటారు.
గత వారం రియల్ ఎస్టేట్ వ్యాపారి క్లబ్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిత్యం తన మొబైల్ కు సదరు వ్యాపారి అసభ్యకరమైన ఎస్ఎమ్ఎస్ లు పంపిస్తున్నారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్ వ్యాపారి పరారీలో ఉన్నాడని, కేసు విచారణలో ఉందని సోమవారం కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్ పై దాడి!
విధులలో ఉన్న కానిస్టేబుల్ పైన దాడి చేసిన ఇద్దరిని బెంగళూరులోని కోడిగేహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. చిక్కబళ్లాపురకు చెందిన శశిధర్, సునీల్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కాంత అనే వ్యక్తి తప్పించుకుని పరారైనాడని పోలీసులు అన్నారు.
యలహంక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో రవిశంకర్ (55) కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఈయన సహకారనగర రైల్వేగేట్ దగ్గర విధులలో ఉన్నారు. ఆ సమయంలో రైలు వస్తుందని తెలుసుకున్న రవిశంకర్ రైల్వే గేట్ వేశారు. అదే సమయంలో సునీల్, శశిధర్, కాంత వాటర్ ట్యాంకర్ తీసుకుని అటు వైపు వచ్చారు.
రైల్వే గేట్ ఎంత సేపు వేస్తారని రవిశంకర్ తో గొడవ పెట్టుకున్నారు. తర్వాత ఇరువర్గాల మద్య వాగ్వివాదం జరిగింది. సహనం కొల్పోయిన నిందితులు కానిస్టేబుల్ రవిశంకర్ మీద దాడి చేశారు. ఆయన ఎడమ చేతిని వెనక్కు విరిచేశారు. కోడిగేహళ్ళి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. కానిస్టేబుల్ రవిశంకర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని పోలీసులు తెలిపారు.