పవన్ కల్యాణ్ ఫ్రెండ్, బీజేపీ యంగ్ ఎంపీ తేజస్వి సూర్య హత్యకు భారీ కుట్ర..!
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్యను హత్య చేయడానికి అల్లరి మూకలు కుట్ర పన్నారనే వార్త కర్ణాటకలో కలకలాన్ని రేపుతోంది. తేజస్వి సూర్యతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త చక్రవర్తి సులిబెలెను కూడా చంపడానికి కొందరు వ్యక్తులు పథకం పన్నారని తేలింది. ఈ కేసులో బెంగళూరులో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు సూత్రధారి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.
ఎవరీ తేజస్వి సూర్య..
తేజస్వి సూర్య మరణానంతరం గత ఏడాదే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బెంగళూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఘన విజయాన్ని సాధించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు సన్నిహితుడు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడి ఏర్పాట్లన్నింటినీ తేజస్వి సూర్యే పర్యవేక్షించారు.
పౌరసత్వ సవరణ ఆందోళనలను అడ్డు పెట్టుకుని..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రదర్శనలు, ఆందోళనల ముసుగులో తేజస్వి సూర్య, చక్రవర్తి సులిబెలెను హతమార్చడానికి కుట్ర పన్నినట్లు సమాచారం. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలోని మంగళూరులో పెద్ద ఎత్తున హింసాత్మక వాతావరణం, అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. మంగళూరు తరహాలోనే బెంగళూరులో కూడా అల్లర్లకు పాల్పడటానికి ప్రయత్నించినట్లు స్పష్టమౌతోంది.
బెంగళూరు నడిబొడ్డున..
బెంగళూరు నడిబొడ్డున ఉన్న సర్ పుట్టణ్ణ ఛెట్టి టౌన్హాల్ వద్ద పలువురు విద్యార్థులు కొంతకాలంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తున్నారు. అదే టౌన్హాల్ వద్ద కిందటి నెల 22వ తేదీన బీజేపీ పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. దీనికి తేజస్వి సూర్య, చక్రవర్తి సులిబెలె హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లర్లుకు పాల్పడాలని, వాటిని అడ్డు పెట్టుకుని వారిద్దర్నీ హత్య చేయడానికి కుట్ర పన్నారనే వార్తలు గుప్పు మన్నాయి.
ఆరుమంది ఎస్డీపీఐ కార్యకర్తల అరెస్టు..
ఈ కేసులో కళాసిపాళ్య పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్, సయ్యద్ అక్బర్, సయ్యద్ సిద్ధిక్, అక్బర్ పాషా, సనా, సాధిక్-ఉల్-అమీన్లను అరెస్టు చేశారు. ఈ ఆరుమందీ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలుగా తేలింది. కిందటి నెల 22వ తేదీన టౌన్హాల్ సమీపంలో అనుమానాస్పదంగా వారు తచ్చాడారని, బైక్పై రాకపోకలు సాగించినట్లు పోలీసులు నిర్దారించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు.
అనుకూల ప్రదర్శనపై రాళ్లు రువ్వి..
పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీపై రాళ్లు రువ్వాలని ముందుగా వారు ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం రాళ్లను సేకరించినట్లు తేలింది. రాళ్లు రువ్వడం వల్ల ప్రదర్శనకారులు చెదిరిపోయే సమయంలో రాడ్లతో తేజస్వి సూర్య, చక్రవర్తి సులిబెలెపై దాడి చేయడం, లేదా వారిపై కాల్పులు జరిపేలా కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. తమ అదుపులో ఉన్న ఎస్డీపీఐ కార్యకర్తలను విచారించిన సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీరించినట్లు పోలీసులు చెబుతున్నారు.