బెంగళూరు ప్రశాంతం: కర్ఫ్యూ , 144 సెక్షన్ ఉంది
బెంగళూరు: బెంగళూరులో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బుధవారం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం ఉదయం నుంచి ఎక్కడా ఎలాంటి ఆందోళనలు జరగకపోవడంతో ఎవరి విధులకు వారు వెళ్లారు.
అయితే బెంగళూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు (144 సెక్షన్), కొన్ని ప్రాంతాల్లో కర్ఫూ అమలులో ఉంది. బెంగళూరు నగరంలో అల్లర్లు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో పోలీసులు, మిలటరీ బలగాలు బుధవారం గట్టి బందోబస్తు కల్పించారు.
బుధవారం ఉదయం నుంచి బీఎంటీసీ (బెంగళూరు సిటీ బస్సులు), ఆటోలు, ట్యాక్సీలతో పాటు మెట్రో రైలు సంచారం మొదలైనాయి. పెట్రోల్ బంకులు, హోటల్స్, అన్ని వ్యాపారాల ధుకాణాలు తీశారు.
అయితే బెంగళూరు నగరంలోని 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫూ అమలులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూరు నగరం ప్రశాంతంగా ఉన్నా 144 సెక్షన్ అమలులో ఉంటుందని బెంగళూరు నగర పోలీసు అధికారులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని ప్రాంతాల్లో ప్రయివేట్ స్కూళ్లు, కాలేజ్ లకు విధ్యార్థులు వెళ్లారు. అయితే పిల్లలను జాగ్రత్తగా విద్యాసంస్థలకు తీసుకు వెళ్లి తిరిగి ఇంటికి పిలుచుకుని వెళ్లాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ మేఘరిక్ మనవి చేశారు.