మేఘాలయలో తీవ్ర ఉద్రిక్తతలు: షిల్లాంగ్ లో కొనసాగుతున్న కర్ఫ్యూ..
షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. షిల్లాంగ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు డ్రైవర్స్, స్థానికులకు మధ్య జరిగిన వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించారు. షిల్లాంగ్ లోని 14ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 4గం. నుంచి కర్ఫ్యూ విధించినట్టు డిప్యూటీ కమిషనర్ పీటర్ ఎస్ తెలిపారు. షిల్లాంగ్ లోని ఓ ప్రాంతం(హరిజన్ లైన్) సమీపంలో ఓ బస్సు డ్రైవర్ పై కొంతమంది గ్యాంగ్ దాడి చేయడంతో ఈ గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు అక్కడికి రావడంతో.. ఆ గ్యాంగ్ వారిపైకి రాళ్లు రువ్వింది.
ఈ ఘటనలో ఒక జర్నలిస్టు సహా మరో నలుగురు సామాన్యులు గాయపడ్డారు. అల్లరిమూకలు నాలుగు వాహనాలను కూడా తగలబెట్టాయి. ప్రస్తుతం షిల్లాంగ్ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. నిందితుల నుంచి పెట్రోల్ బాంబులతో పాటు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సదరు బస్ కండక్టర్ ఓ స్థానిక అమ్మాయిని టీజింగ్ చేయడంతో గొడవ మొదలైందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక మరో వాదన ఏంటంటే.. స్థానికులు నీళ్లు తీసుకువచ్చుకునే మార్గంలో బస్సును పార్క్ చేయడంతో ఓ మహిళ అభ్యంతరం చెప్పిందని, అలా ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణలకు దారితీసిందని చెబుతున్నారు.