బీహార్ సిత్రాలు- లాలూ వైఫల్యాలే నితీశ్ అస్త్రాలు- తన విజయాల్ని పక్కనబెట్టి...
బీహార్ ఎన్నికల సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. ఎన్డీయే కూటమిలోని జేడీయూ-బీజేపీతో మహాకూటమి పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎంఎల్ పోటీపడుతున్నాయి. లోక్జనశక్తి మాత్రం స్వతంత్రంగా బరిలోకి దిగి జేడీయూ కూటమి అభ్యర్ధుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సీనియర్ నేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్ పాశ్వాన్ లేకుండానే ఈ ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఇదే ఓ ఎత్తయితే ఇన్నేళ్లు తనకు ప్రత్యర్ధులుగా ఉన్న ఒకప్పటి సహచరులు ఇప్పుడు ఎన్నికల రణరంగంలో లేకపోయినా సీఎం నితీశ్ కుమార్కు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
జగన్కు నితీశ్ కుమార్ ఫోన్- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో మద్దతుకు వినతి..
బీహార్ ఎన్నికల పోరు...
బీహార్లో మూడు దఫాలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగిపోతోంది. ఈ నెల 28న తొలిదశలో భాగంగా 71 స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో రెండు ప్రధాన కూటముల మధ్య రసవత్తరంగా మారింది. ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జేడీయూ-బీజేపీ, మహాకూటమిలోని కాంగ్రెస్,ఆర్జేడీ, సీపీఎంఎల్ ముఖాముఖీ తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టేందుకు శ్రమిస్తున్న జేడీయూ అధినేత నితీశ్కు సొంత కూటమిలోని బీజేపీతో పాటు స్వతంత్రంగా బరిలోకి దిగిన లోక్జనశక్తి అభ్యర్ధులు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో అధికారం నిలబెట్టుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వ్యూహం మార్చిన నితీశ్...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ జేడీయూతో పాటు ఎన్డీయే కూటమినీ ముందుండి నడిపిస్తున్న సీఎం నితీశ్ కుమార్ వరుసగా అధికారంలో ఉన్నప్పటికీ తన విజయాలను చెప్పుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి తగినంత సహకారం లభించకపోవడంతో గత ఐదేళ్లలో భారీగా చెప్పుకోదగిన స్ధాయిలో నితీశ్కు విజయాలు దక్కలేదు. దీంతో తన విజయాల కంటే కూడా అంతకు ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న లాలూప్రసాద్ యాదవ్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు. ఆర్జేడీతో కూడిన మహాకూటమికి అధికారం కట్టబెడితే గతంలో లాలూ పాలనను మళ్లీ చూడాల్సి వస్తోందని జనంలో నితీశ్ ప్రచారం చేస్తున్నారు. దీంతో నితీశ్కు చెప్పుకునేందుకు విజయాలే లేవా అన్న చర్చ సాగుతోంది.
లాలూను గుర్తుచేసుకోని ఆర్జేడీ...
గతంలో రాష్ట్రంలో 15 ఏళ్లపాటు ఆర్జేడీ పాలన కొనసాగినా ఇప్పుడు అప్పటి పాలనను గుర్తుచేసుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కూడా సిద్ధంగా లేరు. స్వయంగా తల్లితండ్రుల పాలన గురించి మాట్లాడకుండా కొత్త బీహార్ అంటూ తేజస్వి చేస్తున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. తద్వారా బీహార్ ఎన్నికల్లో అటు ఆర్జేడీ కానీ, ఇటు నితీశ్ కానీ లాలూ గురించి నాలుగు మంచి మాటలు చెప్పే పరిస్ధితి లేకుండా పోయింది. ఆర్జేడీ నేతలు లాలూ యాదవ్ ఫొటోను సైతం ఎక్కడా వాడటం లేదు. అదే సమయంలో నితీశ్ మాత్రం లాలూ పాలన గుర్తుచేస్తూ అప్పటి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. దీంతో ఆర్జేడీకి అక్కర్లేని లాలూను నితీస్ స్మరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోతోంది.