వింతలకే వింత: కొత్త వ్యవసాయ చట్టాల ‘సమాచారం’పై చిదంబరం విమర్శలు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల పట్ల కేంద్రం అవలంభిస్తున్న వైఖరి వింతల్లో వింతగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. సోషల్ మీడియా వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయ విధానాలపై చర్చ అనంతరం.. నీతి ఆయోగ్ కమిటీ సంబంధిత నివేదికను సెప్టెంబర్ 2019లోనే సమర్పించిందని తెలిపారు.
అయితే, 16 నెలల గడిచినా ఇప్పటికీ దాన్ని నీతి ఆయోగ్ పాలక మండలికి సమర్పించనే లేదని, ఇలా ఎందుకు జరిగింది అనేది ఎవరికీ తెలియదన్నారు. దీనిపై ఎవరూ సమాధానం చెప్పడం లేదని చిదంబరం మండిపడ్డారు.
అంజలీ భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్త.. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేశారు. అయితే, నివేదికను ఇంకా సమర్పించలేదనే సాకుతో ఆమె ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. నాడు అలీస్ (ప్రముఖ ఆంగ్ల నవల అలీస్ ఇన్ వండర్లాండ్లో ముఖ్యపాత్ర) చెప్పినట్లు ఇది వింతలకే వింతలాగా ఉందన్నారు చిదంబరం.
ఏదేమైనా సరైన సమాచారాన్ని రాబట్టాలనే అంజలి పట్టుదలకు చిదంబరం అభినందనలు తెలియజేశారు. కాగా, నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో సుమారు 50 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో జనవరి 19న మరోసారి చర్చలు జరగనున్నాయి. కాగా, జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేస్తామంటూ రైతులు పేర్కొనడం గమనార్హం.