నోట్ల రద్దుపై ప్లీ: వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు వచ్చేవారం విచారణ జరపనుంది. కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ జారీ చేసిన ప్రకటన నిరంకుశంగా ఉందని, ప్రజలకు నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై వచ్చే మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
అంత తొందరగా పిటిషన్పై విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు భావించింది. కాగా, కేంద్ర ప్రకటనను కొట్టివేయడమో, లేక నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించడమో చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. కాగా, పెద్దనోట్ల రద్దు విషయంపై కేంద్రం కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.
తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని, అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోర్టును కోరింది. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీటిని డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. ఆ తర్వాత సరైన పత్రాలతో ఆర్బీఐ కేంద్రాల్లో నోట్లను మార్చుకునే వీలుంది. దీనికి కూడా గడువు పరిమితమే.