కూల్ కుమారస్వామి: ఎవరు ఏం చేసినా నేను ఏం పట్టించుకోను అంతే, కర్ణాటక సీఎం, బీజేపీ !
బెంగళూరు: సంకీర్ణ ప్రభ్వుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ప్రయత్నించినా, వేరేవాళ్లు ప్రయత్నించినా తనకు ఏమీ సంబంధం లేదని, తనపని తాను చేసుకుని వెలుతానని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం తన మొదటి ప్రాధాన్యత అని సీఎం కుమారస్వామి కూల్ గా చెప్పారు.
అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన సీఎం కుమారస్వామి సోమవారం మద్యాహ్నం మొదటి సారి మీడియాతో ముందుకు వచ్చి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల ఎటు దారితీస్తున్నాయని మీడియా ప్రశ్నించగా కుమారస్వామి పై విధంగా స్పందించారు. నా కంటే మీకే ఎక్కువ సమాచారం ఉందని, అనవసరమైన విషయాలు తాను పట్టించుకోనని సీఎం కుమారస్వామి అన్నారు.
ముఖ్యమంత్రిగా తన ముందు ఏ భాద్యతలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తానని, మిగిలిన వాటి గురించి ఆలోచించే సమయం తనకు లేదని సీఎం కుమారస్వామి అన్నారు. బీజేపీ వాళ్లు ఆపరేషన్ కమల మొదలు పెట్టినా తనకు అభ్యంతరం లేదని, మిగిలిన వాళ్లు ఎలాంటి కుట్రలు చేసినా తాను పట్టించుకోనని సీఎం కుమారస్వామి చెప్పారు.
శనివారం కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, సోమవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేశారు. ఇంత జరుగుతున్నా తాను ప్రస్తుత రాజకీయాల గురించి పట్టించుకోనని సీఎం కుమారస్వామి చల్లగా చెబుతున్నారు.