భారత్తో స్నేహం కావాలంటే ఉగ్రవాదంను అణిచి లౌకిక దేశంగా మారండి: ఇమ్రాన్కు బిపిన్ రావత్ కౌంటర్
పూణే: భారత్తో స్నేహబంధాలు కొనసాగించాలంటే ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టాలని భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. భారత్ ఒక అడుగు ముందుకేస్తే పాకిస్తాన్ రెండు అడుగులు ముందుకేస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బిపిన్ రావత్ స్పందించారు. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదం అనేది పాకిస్తాన్లో ఇంకా ఉందని భారత్తో పాటు ప్రపంచదేశాలు చెబుతుంటే.. దానిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఒకప్పుడు బద్ధ శతృవులని...ఇప్పుడు ఆ రెండు దేశాలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించారు బిపిన్ రావత్.
పాకిస్తాన్ భారత్తో స్నేహం చేయాలంటే ముందు ఆ దేశ అంతర్గత విషయాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ను ఇస్లామ్ దేశంగా చూపిస్తున్నారు. మరోవైపు భారత్ ఒక లౌకిక దేశం. ఒక లౌకిక దేశంతో స్నేహం చేయాలంటే మరో దేశం కూడా లౌకిక దేశంగా మెలగాల్సిన అవసరం ఉందని బిపిన్ చెప్పారు. భారత దేశంలో లౌకికత్వం అలవర్చుకుంటే అప్పుడు పాకిస్తాన్తో కలిసి ముందుకెళ్లే విషయంపై భారత్ ఆలోచిస్తుందన్నారు.
ఇక ఆర్మీ దళాల్లో మహిళల పాత్ర గురించి ప్రస్తావించగా... మహిళలకు ఇప్పుడప్పుడే అలాంటి పాత్ర ఉండకూడదన్నారు. వారికోసం కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉందని చెప్పిన బిపిన్ రావత్... మహిళలు కూడా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేయగలిగి పరిస్థితి ఉండాలని అన్నారు. అది అంత సులభతరమైన విషయం కాదన్నారు. పాశ్చాత్య దేశాలతో మన భారతీయ మహిళలను పోల్చలేమన్నారు. అక్కడ వారికి ఎలాంటి కట్టుబాట్లు ఉండవని చెప్పారు బిపిన్ రావత్.