గుడ్ న్యూస్ : మధ్యతరగతి కుటుంబాలకు పన్నుల నుంచి భారీ రిలీఫ్
న్యూఢిల్లీ: భారత్లో నివాసముంటున్న మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తూ వ్యక్తిగత ఆదాయపు పన్నులను గణనీయంగా తగ్గించడం, మరియు కార్పొరేషన్ ట్యాక్స్లను తగ్గించాలని డైరెక్ట్ టాక్స్ కోడ్ రికమెండ్ చేసింది. అంతేకాదు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్పై పన్ను భారంను రిసీపెంట్పైనే మోపాలని సూచించింది. ప్రస్తుతం ఆ పన్ను భారాన్ని ఆయా కంపెనీలే భరిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలని ప్రత్యక్ష పన్నుల కోడ్ ప్యానెల్ కేంద్ర ఆర్థికశాఖకు సూచించింది. అంతేకాదు స్టార్టప్లకు పలు తాయిలాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. చాలా మటుకు ఉన్న నిబంధనలను మరింత సరళతరం చేయనున్నట్లు సమాచారం.అంతేకాదు ఇలా చేయడం వల్ల టాక్స్పేయర్లకు చాలా సులభతరంగా మారుతుందని అభిప్రాయపడుతోంది కేంద్రం.
అఖిలేష్ రంజన్ నేతృత్వంలోని ప్యానెల్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు నివేదిక సమర్పించారు. అయితే నివేదికలో పన్ను తగ్గింపు గురించి సూచించినప్పటికీ అవి ఇప్పటికిప్పుడు అమల్లోకి రావని తెలుస్తోంది. ఇంకా నివేదికలోని అంశాలను కేంద్రప్రభుత్వం బహిరంగపర్చాల్సి ఉన్న నేపథ్యంలో పన్ను తగ్గింపు అనేది ఇప్పటికిప్పుడు జరగదు. ఒక కంపెనీకి సంబంధించి డివిడెండ్ల పేరుతో వాటాదారులకు లాభాలను పంపిణీ చేస్తున్న సమయంలో ట్రిపుల్ టాక్సేషన్ విధించడం జరుగుతుండగా దానికి అఖిలేష్ రంజన్ ప్యానెల్ చెక్పెడుతూ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ భరిస్తున్న డీడీటీ 20.6శాతంగా ఉంది ఇక రూ.10 లక్షలు దాటితే దానిపై మరో 10శాతం పన్ను విధించడం జరుగుతుంది. ప్రపంచ మార్కెట్లో మంచి పోటీ ఇవ్వాలంటే ఈ పన్ను విధానం 20 నుంచి 22శాతం ఉండాలని ప్యానెల్ సూచించింది.
దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రత్యక్ష్య పన్ను కోడ్ను అమలు చేయాల్సిందిగా కోరుతూ అఖిలేష్ రంజన్ నేతృత్వంలో కేంద్రం ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 58ఏళ్ల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టంను మార్చి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇతర దేశాల్లో పన్ను విధానాలు వాటి ఆర్థిక పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్యానెల్ నివేదికను సిద్ధం చేసింది. వాస్తవానికి మే 31నే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరో రెండు నెలలు సమయం ఇచ్చారు నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. దీంతో ఆగష్టు 16కు నివేదిక సమర్పించాలని కేంద్రం కోరడంతో మరికొన్ని అంశాలను అందులో పొందుపర్చి కొత్త ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు నివేదిక అందజేశారు.