బీజేవైఎం నేత ఆఫర్: కన్నయ్య నాలుక తెగ్గోస్తే 5లక్షల రివార్డు
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసు కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఎన్యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్పై భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నయ్యకుమార్ నాలుక తెగ్గోసిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించేశారు.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని బుదాన్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు కుల్ దీప్ వర్ష్ నే ఈ ప్రకటన చేశాడు. ఈ ప్రకటనను చూస్తుంటే జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను కన్నయ్య కుమార్ను బీజేపీ టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా జేఎన్యూలో ఫిబ్రవరి 9న జరిగిన కార్యక్రమాన్ని కుల్ దీప్ వర్ష్ నే ఖండించారు. ఆ రోజు వర్సిటీలో జరిగినదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అది దేశ ద్రోహమా? కాదా? అనేది కోర్టు తేల్చాల్సి ఉందని, న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల తమకు నమ్మకముందని అన్నారు.
జాతి వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా కన్నయ్య ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకున్నాడని వర్ష్ నే అభిప్రాయపడ్డారు. కాగా, దేశద్రోహం కేసులో కన్నయ్య కుమార్ గత నెల 12న అరెస్ట్ కాగా, ఢిల్లీ హైకోర్టు ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో గురువారం విడుదలైన విషయం తెలిసిందే.
బెయిల్పై విడుదల అనంతరం పార్లమెంట్ పై దాడి దోషి అఫ్జల్ గురు తనకు ఆదర్శం కాదని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తనకు మార్గదర్శకుడని కన్నయ్య ఓ సభలో బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీజేవైఎం నేతపై బహిష్కరణ వేటు
కన్నయ్య కుమార్ నాలుకకు వెలకట్టిన బీజేపీ యువ మోర్చా నేత కుల్దీప్ వార్ష్ నేపై ఉత్తరప్రదేశ్ బర్ద్వాన్ జిల్లా బీజేపీ యూనిట్ చర్యలు తీసుకుంది. పార్టీని ఇబ్బందుల్లో పడేసేలా కన్నయ్య కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కుల్దీప్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ బహిష్కరణ ఆరేళ్లపాటు వర్తిస్తుందని జిల్లా నేతలు స్పష్టం చేశారు. అతనిని బహిష్కరించామని, అతని వ్యాఖ్యలకు, పార్టీకి సంబంధం లేదని ఆయన చెప్పారు.