31ఏళ్ల తర్వాత 'కటక్'కి దేశ ప్రధాని: చివరి పర్యటన రాజీవ్ గాంధీదే..
కటక్: బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే 26న ఒడిశాలోని కటక్ నగరంలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కటక్ లోని చారిత్రక బాలియాత్ర మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో కాంగ్రెస్ 48ఏళ్ల పాలనను, ఎన్డీయే 48నెలల పాలనను మోడీ ప్రజలకు వివరించనున్నారు.
కాగా, 1987 తర్వాత దేశ ప్రధాని కటక్ నగరానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంటే, 31ఏళ్ల తర్వాత మొదటిసారిగా కటక్ నగరానికి ప్రధాని రానున్నారు. చివరిసారిగా 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కటక్ నగరానికి వచ్చారు. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన 5వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పాల్గొన్నారు.
అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ దేశప్రధానిగా ఉన్న సమయంలో రెండుసార్లు ఇక్కడికి వచ్చారు. ఇందిరాగాంధీ కూడా ప్రధానిగా ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం కటక్ బాలిజాతర మైదానానికి వచ్చారు.
భద్రత కట్టుదిట్టం:
ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కటక్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మే 26న మొదట విమానంలో మోడీ భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా కటక్ నరాజ్ ప్రాంతానికి చేరుకుంటారు. భద్రతా ఏర్పాట్లన్ని ఇప్పటికే పూర్తయినట్టు చెప్పారు.
బుధవారం ఢిల్లీ నుంచి ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అధికారులు బాలిజాతర మైదానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రమంత్రి జోయల్ ఓరం, భాజపా నేత నయన్కిశోర్ మహంతి సైతం మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.