సీబీఐ ఈడీల్లో కూడా అవినీతి అధికారులు ఉన్నారట: విచారణ అనుమతి కోసం సీవీసీ పడిగాపులు
న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడ్డ 123 మంది ప్రభుత్వ అధికారులను విచారణ చేసేందుకు అనుమతి కోసం కేంద్ర నిఘా సంస్థ సీవీసీ ఎదురుచూస్తోంది. ఇందులో ఐఏఎస్ అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం పరిధిలో నడిచే సీబీఐ, ఈడీ, ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడిన అధికారులను విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గత నాలుగు నెలలుగా సీవీసీ ఎదురు చూస్తోంది.
నాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు: డీజీపీ కార్యాలయంలో యామిని సాధినేని ఫిర్యాదు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 123 మంది ఉండగా వీరిలో 45 మంది అధికారులు బ్యాంకుల్లోనే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం నాలుగునెలల్లోగా వీరిని విచారణ చేయాల్సి ఉంది. అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఓ నివేదిక ప్రకారం 57 కేసులు ఇలా విచారణ జరగకుండా పెండింగ్లో పడిపోయినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్లో నుంచి 8 కేసులు ఉండగా, రైల్వే శాఖ నుంచి 5 కేసులు, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవినీతికి సంబంధించి నిఘా వేయాల్సిన మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ శాఖలోనే అవినీతి పరులు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. సీబీఐలో ఓ అడిషనల్ ఎస్పీ, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్, ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఓ అధికారిని విచారణ చేయాల్సి ఉందని ఏప్రిల్ వరకు విడుదలైన సమాచారం ద్వారా తెలుస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,కెనరా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాదు బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 45 మంది అధికారులు అవినీతికి పాల్పడగా వారిపై 15 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా రెండు అవినీతి కేసులు నమోదైనట్లు సీవీసీ తెలిపింది. రెవిన్యూ శాఖ, రక్షణశాఖ, ఆహార శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల్లో కూడా భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇక చత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది.